దూకుడు పెంచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

ABN , First Publish Date - 2020-06-30T18:26:05+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దూకుడు పెంచారు.

దూకుడు పెంచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దూకుడు పెంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిన్న ఆడియో సాంగ్ విడుదల చేసిన ఆయన ఇవాళ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఆయన బీజేపీకి మరింత దగ్గరయ్యేలా వీడియో సాంగ్ ఉంది. మోదీతో రఘురామకృష్ణంరాజు కలిసున్న ఫొటోలతో సాంగ్ విడుదల చేశారు.


‘జయం మనది.. జయం మనది.. జయం మనదిరా.. నవభారత రథసారథి మోదీ సారథ్యంలో’... అంటూ నిన్న ఆడియో సాంగ్ విడుదల చేసిన  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మంగళవారం వీడియో సాంగ్ విడుదల చేశారు. వీడియో సాంగ్‌లో మోదీ ప్రభుత్వం సాహసాలు, డ్రాగన్ కుట్రలు, భారత సైన్యం ఫోటోలతో పాటను రూపొందించారు. అంతే కాకుండా తాను, మోదీ కలిసి ఉన్న ఫోటోలను సైతం పాటలో పెట్టారు.


నిన్న తనకొచ్చిన షోకాజ్ నోటీసుకు బదులు ఇస్తునే.. మరోవైపు తన వాట్సాప్ నుంచి వాయిస్ మెసేజ్‌లు అందరికీ విడుదల చేశారు. దీనిపై నిన్నంతా చర్చ జరిగింది. రఘురామకృష్ణం రాజు బీజేపీలోకి వెళతారని వైసీపీ వర్గాలు అనుకుంటున్న సమయంలో ఈ పాట వాయిస్ మెసేజ్‌లో నిన్న రావడం, ఇవాళ వీడియో సాంగ్ విడుదల కావడం అంతా చర్చనీయాంశమవుతోంది. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని అనుకుంటున్నారు.

Updated Date - 2020-06-30T18:26:05+05:30 IST