అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
ABN , First Publish Date - 2022-05-08T08:40:51+05:30 IST
అక్రమ అరెస్టులకు విద్యార్థి నేతలు భయపడవద్దని, అధైర్య పడవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. వారికి
ఎన్ఎస్యూఐ నేతలకు రాహుల్గాంధీ భరోసా
చంచల్గూడ జైలులో విదార్థులతో ములాఖత్
సైదాబాద్/యూస్ఫగూడ/రాంగోపాల్పేట/రాంనగర్, మే 7 (ఆంధ్రజ్యోతి): అక్రమ అరెస్టులకు విద్యార్థి నేతలు భయపడవద్దని, అధైర్య పడవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడాలని, వెంట తాముంటామని భరోసా ఇచ్చారు. శనివారం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తోపాటు 17 మంది విద్యార్థి నేతలతో ఆయన ములాఖత్ అయ్యారు. జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ములాఖత్ ఏర్పాట్లు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి జైలులోకి వెళ్లిన రాహుల్.. సుమారు 20 నిమిషాలపాటు విద్యార్థులను పరామర్శించి భరోసా ఇచ్చారు. రాహుల్ వెంట భట్టి విక్రమార్క ఒక్కరు మాత్రమే వెళ్లేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు మాన్యువల్ ప్రకారం ప్రతి రిమాండ్ ముద్దాయిని ముగ్గురు చొప్పున కలిసే అవకాశం ఉందని, అయినా కేసీఆర్ ఒత్తిడితో తమ నేతలెవరికీ అనుమతి ఇవ్వలేదని తప్పుబట్టారు.
సంజీవయ్యకు నివాళి..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ శనివారం పీవీ మార్గ్లోని సంజీవయ్య పార్క్లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఘాట్ను సందర్శించారు. ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి సంజీవయ్యకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంజీవయ్య పార్క్ నుంచి రాహుల్ కాన్వాయ్ తిరిగి వెళ్లే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్ కారును పోలీసులు కాసేపు నిలిపివేశారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు గాంధీభవన్ నుంచి పాసులు పొందిన కాంగ్రెస్ శ్రేణులను సంజీవయ్య పార్క్లోకి పోలీసులు అనుమతించలేదు. తమకు ఇచ్చిన జాబితాలో పేర్లు ఉన్నవారినే పంపుతామని చెప్పారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక గాంధీభవన్లో సమావేశం ముగిసిన తర్వాత రాహుల్గాంధీ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో కలిసి లుంబినీపార్కు వద్ద నిర్మాణంలో ఉన్న అమరుల స్తూపాన్ని పరిశీలించారు.