మతం మేకప్‌లో రాహుల్‌గాంధీ

ABN , First Publish Date - 2021-09-14T05:47:20+05:30 IST

‘నేను కశ్మీర్ పండితుడిని. మా కుటుంబం కశ్మీరీ పండిత కుటుంబం..’ అని జమ్ము కశ్మీర్‌లో దేవాలయాలు తిరుగుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జమ్ములో ఒక వేదికపై నుంచి...

మతం మేకప్‌లో రాహుల్‌గాంధీ

‘నేను కశ్మీర్ పండితుడిని. మా కుటుంబం కశ్మీరీ పండిత కుటుంబం..’ అని జమ్ము కశ్మీర్‌లో దేవాలయాలు తిరుగుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జమ్ములో ఒక వేదికపై నుంచి ఆయన ‘జైమాతాదీ’ అని కూడా నినాదాలు ఇస్తూ కార్యకర్తలతో కూడా చేయించారు. వైష్ణోదేవీ యాత్రకు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. 2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాహాటంగా తమ విశ్వాసాల గురించి, మూలాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం పలు రాజకీయ పార్టీల నాయకులకు కూడా ఏర్పడిందని రాహుల్ గాంధీ ప్రకటనలు వింటున్న వారెవరికైనా అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో, దేశంలో మెజారిటీలయిన హిందువులు అస్తిత్వ పరీక్షను ఎదుర్కోవలసి వచ్చినందుకే వారు భారతీయ జనతాపార్టీ వెనుక సంఘటితంగా నిలిచారన్న వాదన నూటికి నూరుపాళ్లు నిజం. గత ఎన్నికల సమయంలో కూడా రాహుల్‌గాంధీ తాను జందెం ధరిస్తానని, శివ భక్తుడినని చెప్పుకున్నారు.


నిజానికి ఇవాళ కశ్మీరీ పండితుడినని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్‌ హయాంలోనే జమ్ము కశ్మీర్‌లో వేలాది మంది కశ్మీరీ పండితుల ఊచకోత జరిగింది. బ్రిటిష్ కాలంలో కశ్మీర్ లోయలో 50 శాతం పైగా కశ్మీరీ పండితులు నివసించేవారు. దేశ విభజన సమయంలో అరాచకాల తర్వాత 20 శాతంపైగా ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లారు. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు అక్కడి అబ్దుల్లాలతో కాళ్లబేరానికి వచ్చిన ఒప్పందాలు కుదుర్చుకోవడమే తప్ప కశ్మీర్‌లో హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నెహ్రూ హయాంలోనే కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ శ్రీనగర్‌లో అరెస్టయిన తర్వాత కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. తండ్రిబాటలో నడిచిన ఇందిరగాంధీ 1975లో -షేఖ్ అబ్దుల్లాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కశ్మీరీ పండితుల ఊచకోత తీవ్రతరమైంది. రాజీవ్ గాంధీ కూడా షేఖ్ అబ్దుల్లా కుమారుడు ఫరూక్ అబ్దుల్లాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత హిందువులపై హింసాకాండ మరింత పెరిగింది. మఖ్బూల్ భట్ అనే ఉగ్రవాదికి శిక్ష విధించినందుకు జస్టిస్ నీల్‌కాంత్ గంజూ అనే న్యాయమూర్తిని హైకోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ప్రేంనాథ్ భట్ అనే జర్నలిస్టునూ హత్య చేశారు. కశ్మీరీ పండితులు జమ్ముకశ్మీర్ విడిచివెళ్లకపోతే హతమారుస్తామని హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు స్థానిక పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చేవి. దాదాపు 2500హిందూ గ్రామాల పేర్లను అప్పటి ప్రభుత్వం మార్చివేసింది. 1990లలో దాదాపు 3 లక్షల మంది హిందువులు కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.ఇవాళ కశ్మీరీ పండితులు తమ దేశంలో తాము శరణార్థులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అస్తవ్యస్థ, అరాచక విధానాలు కాదా? ఇవాళ తాను కశ్మీరీ పండితుడినని రాహుల్ గాంధీ చెప్పుకున్నంత మాత్రాన కశ్మీర్‌లో కానీ, దేశంలో కానీ హిందువులు కాంగ్రెస్‌ను విశ్వసించే పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా?


కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో దాని మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టంగా చెప్పారు. ఆ పార్టీ పరిస్థితి భూములు కోల్పోయి బంగళాలు శిథిలావస్థలో ఉన్న జమీందార్ లాగా ఉన్నదని, గత వైభవం చూసి మురిసిపోవడమే కాని ప్రస్తుతం తన ఇంటిని చక్కదిద్దుకునే సామర్థ్యం దానికి లేదని పవార్ వ్యాఖ్యానించారు. నాయకత్వం గురించి మాట్లాడితేనే ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడతారని శరద్ పవార్ చెప్పడం కాంగ్రెస్‌లో పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. 


దేశంలో మిగతా బిజెపియేతర పార్టీల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే తన అరాచక, అవినీతి పాలనతో జనాదరణ కోల్పోయి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టివేశారు. ఆయన సిబిఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు నానా కష్టాలు పడవలిసివస్తోంది. ప్రజలకు మాయమాటలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె.చంద్రశేఖర్ రావు నిజస్వరూపాన్ని ఇన్నాళ్లకు జనం పూర్తిగా తెలుసుకున్నారన్న విషయం స్పష్టమవుతోంది. తన నిరంకుశపాలన పట్ల జనం విసిగిపోయారని, బిజెపి చేతుల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న కేసిఆర్ ఇటీవల దాదాపు తొమ్మిది రోజులు ఢిల్లీలో గడపడం ఆయన పరిపాలనా తీరుతెన్నులకు అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక పార్టీ అధినేత తొమ్మిది రోజులు ఢిల్లీలో కాలక్షేపం చేస్తూ గడపడం ఏ సంకేతాలు పంపుతుంది? ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలుసుకోవడం ద్వారా తనకు ఢిల్లీలో కేంద్రం మద్దతు ఉన్నదని భావిస్తే అది భ్రమే అవుతుంది. రాజకీయాలు వేరు, పరిపాలనా వ్యవస్థ వేరు అన్న విషయం బిజెపి నేతలకు, ప్రజలకు స్పష్టంగా తెలుసు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మరో నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఆమెతో పాటు ఇటీవల అధికారంలోకి వచ్చిన డిఎంకె అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఇల్లు చక్కదిద్దుకునే క్రమంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్‌, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలూప్రసాద్ యాదవ్‌ పాలనలో జరిగిన అకృత్యాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఈ పార్టీలు కూడా అస్తిత్వ పరీక్షలోనే ఉన్నాయి. కాగితపు పులుల్లా వ్యవహరించడం తప్ప జనంలో ఏ మాత్రం పట్టులేని వామపక్షాలు సైతం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి.వీరందరూ భారతీయ జనతాపార్టీని ఓడించి కలిసికట్టుగా అధికారంలోకి రావడం సాధ్యమా?


ఈ దేశంలో సంస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగి ప్రజల్లో నిత్యం పనిచేస్తూ ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతాపార్టీయేనని చెప్పక తప్పదు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తూ నవభారత నిర్మాణానికి అవసరమైన విధానాలను అమలు చేస్తూ ఉంటే మరోవైపు పార్టీ 18 కోట్ల మందికి పైగా సభ్యులతో దేశంలో కింది స్థాయి నుంచి బలోపేతమవుతోంది. ఇవాళ మోదీని కానీ, భారతీయ జనతాపార్టీని కానీ సైద్ధాంతికంగా, విధానాలపరంగా సవాలు చేయగల పార్టీ ఏదీ జాతీయస్థాయిలో లేదని, అసలు మోదీని ఢీకొనగల నాయకుడెవరూ కనపడడం లేదని సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా ఇటీవల ఒక వ్యాసంలో రాశారు. భారతదేశం ఇవాళ అన్ని రంగాల్లో పురోగమిస్తూ అగ్రదేశాల సరసన నిలబడేందుకు మోదీ నాయకత్వంలో సిద్ధపడుతున్న సమయంలో రాహుల్ గాంధీ వంటి నేతలు తమ మతాన్ని గుర్తు చేసుకోవాల్సిరావడం ఒక విషాదకర హాస్యసన్నివేశం.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-09-14T05:47:20+05:30 IST