ఆర్భాటాల అతిశయోక్తులు పతనమయ్యాయి : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-12-01T21:39:59+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 పెంచిన నేపథ్యంలో ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయని దుయ్యబట్టారు.
రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో, ‘‘ద్రవ్యోల్బణం ఎగబాకడంతో, ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయి’’ అని ఎద్దేవా చేశారు. దీనికి #LPG”, “#Pricehike“ హ్యాష్ట్యాగ్స్ ఇచ్చారు.
19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.100.50 పెంచుతున్నట్లు నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.2,101కి చేరింది. నవంబరు 1న కూడా ఈ సిలిండర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
తాజా పెరుగుదల తర్వాత ప్రధాన నగరాల్లో కమర్షియల్ 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను పరిశీలించినపుడు, ఢిల్లీలో రూ.2,101; ముంబైలో రూ.2,051; కోల్కతాలో రూ.2,174.50; చెన్నైలో రూ.2,234.50కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి.
నవంబరు 1న ప్రతి కమర్షియల్ ఎల్పీజీ 19 కేజీల సిలిండర్పైనా రూ.266 పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచలేదు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అత్యధిక ద్రవ్యోల్బణం రేటు, వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంపై చర్చ జరపాలని కోరారు.