23న కోవైకి రాహుల్‌.. మూడు రోజుల ప్రచారం

ABN , First Publish Date - 2021-01-17T16:38:37+05:30 IST

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఈనెల 23వ తేదీ

23న కోవైకి రాహుల్‌.. మూడు రోజుల ప్రచారం

చెన్నై : కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఈనెల 23వ తేదీ కోయంబత్తూర్‌కు చేరుకొని మూడు రోజులు ప్రచారం చేపట్టనున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఊపందుకుంది. అధికార అన్నా డీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేపట్టారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్‌ ‘ప్రజా గ్రామసభలు’ పేరిట అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ గతంలో ‘వేల్‌ యాత్ర’ పేరిట రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టి, తాజాగా ‘నమ్మ ఊరు పొంగల్‌’ పేరిట వేడుకలు నిర్వహించింది. 


ఇక డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌, టీఎంసీ అధ్యక్షుడు జీకేవాసన్‌ కూడా ప్రచారం ప్రారంభించారు. డీఎంకే కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల ప్రచారానికి సమాయాత్తమవుతుంది. ఈ నేపథ్యంలో, ఈనెల 23వ తేది ఆ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ కోయంబత్తూర్‌ చేరుకొని మెగా రోడ్‌షో పేరిట పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం ఈరోడ్‌, తిరుప్పూర్‌ జిల్లాల్లో పర్యటించే రాహుల్‌ చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. అనంతరం తారాపురంలో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. రెండో రోజు కరూర్‌, దిండుగల్‌ జిల్లాల్లోను, మూడో రోజు మదురై జిల్లాల్లో నిర్వహించే రోడ్‌షోలలో ఆయన పాల్గొననున్నారు.

Updated Date - 2021-01-17T16:38:37+05:30 IST