కుస్తీ, హాకీ కాదని..

ABN , First Publish Date - 2020-09-29T08:54:14+05:30 IST

పీఎల్‌లో ఔరా అనిపించే బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాటియా రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు.

కుస్తీ, హాకీ కాదని..

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఔరా అనిపించే బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాటియా రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. కాట్రెల్‌ వేసిన ఓవర్‌లో పూనకం వచ్చిన వాడిలా చెలరేగిన తెవాటియా.. 5 సిక్స్‌లు బాది మ్యాచ్‌ను రాజస్థాన్‌ వైపు తిప్పేశాడు. 2014 నుంచి అతడు ఐపీఎల్‌లో ఆడుతున్నా రాని గుర్తింపు ఒక్క మ్యాచ్‌తోనే స్టార్‌ను చేసింది. 


ఆ క్రీడల్లో ఆడించాలనుకున్నా..

రాహుల్‌ది హరియాణాలోని సిహి గ్రామం. తండ్రి కృషన్‌ పాల్‌ది పాల వ్యాపారం. తెవాటియా తాత అతడిని పహిల్వాన్‌ చేయాలనుకుంటే.. మామ మాత్రం హాకీ ఆడించాలనుకున్నాడు. కానీ, రాహుల్‌ మాత్రం క్రికెట్‌వైపు ఆకర్షితుడయ్యాడు. దీంతో ఎనిమిదేళ్ల వయసులో ఫరీదాబాద్‌లోని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ విజయ్‌ యాదవ్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. లెగ్‌ స్పిన్నర్‌గా కెరీర్‌ ఆరంభించిన తెవాటియా.. తర్వాత బ్యాటింగ్‌లోనూ నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. 2013లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 


ఢిల్లీ నుంచి రాయల్స్‌కు..

లెగ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన తెవాటియాను 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌  కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 16 పరుగులు చేయగా.. 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి ఏడాది అతడిని రాయల్స్‌ రూ. 10 లక్షలకు కొన్నా  కేవలం ఒకే మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది. 2016లో ఐపీఎల్‌కు దూరమైనా మరుసటి ఏడాది పంజాబ్‌ తరఫున ఆడాడు. 2018లో ఢిల్లీ అతడికి రూ. 3 కోట్లు పెట్టడంతో.. అంతపెట్టి ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను ఎందుకు కొన్నారా? అని ఆరా తీశారు.  2019లో కూడా తెవాటియా ఢిల్లీకే ఆడినా.. 2020 ఐపీఎల్‌ ముందు జరిగిన ట్రేడింగ్‌లో మళ్లీ రాయల్స్‌ గూటికి చేరాడు. తాజా సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడు. 


అమ్మోరు పూనిందేమో!


తెవాటియా బ్యాటింగ్‌ను వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసించాడు. అతడికి అమ్మోరు పూనిందని ట్వీట్‌ చేశాడు. ‘తెవాటియాను అమ్మోరు ఆవహించింది. క్రికెట్‌ ఎలాగో.. జీవితం అలాంటిది. నిమిషాల్లో మారిపోతుంద’ని సరదాగా ట్వీట్‌ చేశాడు. 


హమ్మయ్య...ఒక్క బంతినైనా వదిలేశావ్‌!


ముంబై: పంజాబ్‌పై రికార్డు ఛేదనలో హీరోగా నిలిచిన రాహుల్‌ తెవాటియాకు యువరాజ్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకంటారా.. కాట్రెల్‌ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లు మాత్రమే కొట్టినందుకట. 2007 టీ20 ప్రపంచక్‌పలో బ్రాడ్‌ ఓవర్‌లో యువరాజ్‌ ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. అందుకే ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్యూ భాయ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘రాహుల్‌ భాయ్‌... ఆరు బంతుల్లో ఒక్క బంతినైనా మిస్‌ చేసినందుకు కృతజ్ఞతలు. మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్‌కు అభినందనలు. మయాంక్‌, సంజూ కూడా ఇరగదీశారు’ అని యువీ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-09-29T08:54:14+05:30 IST