23 వేల మందికి 32,899 ఎకరాల్లో పట్టాలు
ABN , First Publish Date - 2020-12-03T05:14:17+05:30 IST
ఆర్ఓఎఫ్ఆర్ సాగు పట్టాలతో గిరిజన రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్ తెలిపారు.
ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్
సీతంపేట: ఆర్ఓఎఫ్ఆర్ సాగు పట్టాలతో గిరిజన రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్ తెలిపారు.బుధవారం సీతంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 23 వేల మంది గిరిజన లబ్ధిదారులకు 32,899 ఎకరాల్లో సాగు హక్కు పట్టాలు అందజేస్తామని తెలిపారు. జనవరి ఒకటో తేదీన రూ.146 చెల్లిస్తే పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేసి, సబ్ డివిజన్ చేస్తామని చెప్పారు. దీని ద్వారా 1బి ఖాతా నమోదు అవుతుందని, సుమోటో మూటేషన్ చేయిస్తామని, భూసరిహద్దులు కూడా నిర్ణయిస్తామని తెలిపారు. ఈనెల 31 నాటికి నాడు-నేడు పనులు ఆరు మండలాల్లో పూర్తి చేస్తామన్నారు.గిరిజన ఆశ్రమ పాఠశాలలు కరోనా నిబంధనలు పాటించి తెరిచామని, అన్ని చర్యలు తీసుకొని 8,9,10 తరగతులను ప్రస్తుతం నిర్వహిస్తున్నామని తెలిపారు. సీతంపేటలోని ఎక్సరే యూనిట్ను వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సీతంపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నుంచి వైటిసి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ప్రవర్తనా నియమావళిపై అవగాహన
సీతంపేటలోని ఐటీడీఏ ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రవర్తనా నియమావళిపై డివిజనల్ స్థాయి అవగాహన తరగతులను బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పీవో సీహెచ్ శ్రీధర్, సచివాలయ సంయుక్త సంచాలకుడు ఎం. సురేష్ మాట్లాడుతూ కార్యాలయాల్లో సిబ్బంది సమాచారం, ప్రచార, నడవడిక, పరివర్తన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో పాలకొండ డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రభావతి, డీఎల్పీవో సత్యనారాయణ, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, పాలకొండ డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.