వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-07-24T06:45:37+05:30 IST

జిల్లాను శుక్రవారం కూడా భారీవర్షం ముంచెత్తింది.

వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజీ వద్ద వరదనీటితో నిండుకుండలా కృష్ణానది

మూడో రోజూ వీడని వర్షం 

పొంగి పొర్లుతున్న వాగులు

లింగాల కాజ్‌వేపై వరదనీరు 

ఆంధ్రా, తెలంగాణ మధ్య వాహనాల రాకపోకలు బంద్‌

నీటమునిగిన ముక్తేశ్వరాలయం 

2,974 హెక్టార్లలో నీట మునిగిన పైర్లు

లంక గ్రామాల్లో అప్రమత్తం 


జిల్లాను శుక్రవారం కూడా భారీవర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వైరా, కట్టలేరు, మునేరు, వజినేరు తదితర వాగులు పొంగి పొర్లుతున్నాయి. పోలంపల్లి ఆనకట్ట వద్ద 49వేల క్యూసెక్కుల నీరు  ప్రవహిస్తోంది. లింగాల కాజ్‌వేపై రెండున్నర అడుగుల నీరు ప్రవహిస్తుండటంతో  ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బలివే వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే రహదారి కొట్టుకుపోయింది. ముక్త్యాల వద్ద భవానీ ముక్తేశ్వరాలయం నీట మునిగింది. 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నందిగామ మండలం దాములూరు వద్ద  కల్వర్టు పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో దాములూరు కూడలి వద్ద  రాకపోకలు నిలిచిపోయాయి. వరి పొలాలు నీట మునిగి ఉండటంతో పైరు చనిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది. లంక గ్రామాల వెంబడి అధికారులు  అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు.


2,974 హెక్టార్లలో పంటలు నీట మునక 

భారీవర్షాల కారణంగా శుక్రవారం నాటికి జిల్లాలో 2,974 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, పెసరపైర్లు నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. గన్నవరం, ముదినేపల్లి, బంటుమిల్లి, కృత్తివెన్ను, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో 62 గ్రామాల్లో వరి పైరు, వత్సవాయి, వీరులపాడు మండలాల్లోని ఆరు గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న, పెసర పైర్లు నీటమునిగినట్టు అధికారులు ప్రాఽథమిక నివేదికను పంపారు. 


కృత్తివెన్నులో 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం 

జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు కృత్తివెన్నులో 104.5 మిల్లీమీటర్లు, బంటుమిల్లిలో 102.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం, తోట్లవల్లూరులో అత్యల్పంగా 22.6 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 56.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. ముదినేపల్లిలో 93.6, కైకలూరులో 87.4, నూజివీడులో 87.4, విస్సన్నపేటలో 87.4, బాపులపాడులో 79.2, మండవల్లిలో 79.2. మైలవరంలో 78.2, తిరువూరులో 78.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలిదిండిలో 67.4, గుడ్లవల్లేరులో 66.6, నందివాడలో 64.8, గుడివాడలో 64.8, చాట్రాయిలో 64.6, పెదపారుపూడిలో 64.2, విజయవాడ రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో 63.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెడ్డిగూడెంలో 62.2, పెడన 59.4, ఉంగుటూరులో 59.2, అవనిగడ్డలో 58.8, ఇబ్రహీంపట్నంలో 57.4,  చల్లపల్లిలో 52.4, ముసునూరులో 50.8, గంపలగూడెంలో 50.6, జగ్గయ్యపేటలో 50.6 మిగిలిన ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది. 


ముంపులో ముక్తేశ్వరాలయం 

జగ్గయ్యపేట రూరల్‌ : కృష్ణానది ఉత్తరవాహిని క్షేత్రం ముక్త్యాలలోని భవానీ ముక్తేశ్వరాలయం వరద నీటిలో మునిగింది. శుక్రవారం పులిచింతల నుంచి మూడు గేట్ల ద్వారా 52,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయటంతో వరద ప్రవాహానికి ఆలయం నీట మునిగింది. కృష్ణా వరదతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేటి నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో మండలంలోని రావిరాల వద్ద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక గ్రామాల ప్రజలను పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ అధికారులు అప్రమత్తం చేశారు.  



Updated Date - 2021-07-24T06:45:37+05:30 IST