బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే అలాంటి ఘటనలు జరగడం లేదు: నిర్మలా సీతారామన్
ABN , First Publish Date - 2021-10-13T21:52:33+05:30 IST
లుగురు రైతుల మరణానికి దారితీసిన లఖింపూర్ ఖేరి ఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
న్యూఢిల్లీ: నలుగురు రైతుల మరణానికి దారితీసిన లఖింపూర్ ఖేరి ఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు.ఇలాంటి హింసాత్మక ఘటనలను ఎవరైనా ఖండించాల్సిందేనని అన్నారు. అయితే, ఈ తరహా ఘటనలు ఒక ప్రాంతానికే పరిమితమై ఉండవని, దేశంలోని ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా, వాటిని ప్రస్తావించాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు హార్వార్డ్ కెన్నడీ స్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, లఖింపూర్ తరహా ఘటనలు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే జరగడం లేదని పేర్కొన్నారు.
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆత్మరక్షణ పంథాలో ఎందుకు వ్యవహరిస్తాన్నారు? అంటూ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ''అలాంటిదేమీ లేదు'' అని సమాధానమిచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండిస్తారని, అందరి అభిప్రాయమూ ఒకేలా ఉంటుందని అన్నారు. ఇదే సమయంలో మిగతా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగనప్పుడు కూడా అందరూ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేయాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగినప్పుడే సమస్యగా చిత్రీకరించ కూడదని అన్నారు. లఖింపూర్ ఘటనలో తన క్యాబినెట్ సహచరుని కుమారుడికి చిక్కులు ఎదురయ్యాయని, అందులో ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది కూడా విచారణలో తేలిన తర్వాతే తగిన న్యాయం జరుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
సాగు చట్టాలపై...
సాగు చట్టాలపై రైతు నిరసనలపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, దశాబ్దానికి పైగా వివిధ పార్లమెంటరీ కమిటీలతో చర్చలు జరిపిన తర్వాతే మూడు సాగు చట్టాలను తీసుకు వచ్చామని చెప్పారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చలు జరిపామని అన్నారు. ప్రతి ఒక్క భాగస్వామితోనూ చర్చించే చట్టాలు తెచ్చామని చెప్పారు. లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు కూడా విస్తృత చర్చ జరిగిందని, వ్యవసాయ మంత్రి కూడా సమాధానం ఇచ్చారని తెలిపారు. రాజ్యసభకు వచ్చినప్పుడే ప్రతిఘటనలు, రభస చేటుచేసుకున్నాయని అన్నారు. పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఫలానా పాయింట్ అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని, కనీస మద్దతు ధర అనే అంశం తీసుకుంటే ఎంఎస్పీ ప్రకటిస్తూనే ఉన్నామని చెప్పారు. ఫలానా విషయంపై నిరసన చేస్తున్నామని వారు చెప్పనప్పటికీ ఇవాల్టికి కూడా చర్చకు తాము సుముఖంగానే ఉన్నామని వివరించారు.