అమరావతికి అండగా ఉంటే దాడులు

ABN , First Publish Date - 2021-10-21T05:40:39+05:30 IST

అమరావతికి అండగా ఉండే వారిపై పాలకులు దాడులు చేస్తున్నారని రాజధాని రైతులు తెలిపారు.

అమరావతికి అండగా ఉంటే దాడులు
పెదపరిమి నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

673వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, అక్టోబరు 20: అమరావతికి అండగా ఉండే వారిపై పాలకులు దాడులు చేస్తున్నారని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 673వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని రైతుల పోరాటానికి వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయన్నారు. అటువంటి పార్టీల మీద దాడులు చేయటంతో సామాన్యులు కూడా భయపడుతున్నారన్నారు. ఇంత అరాచక పాలన ఎక్కడా చూడలేదన్నారు. న్యాయమడిగితే రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడి చేశారని, ఇది దారుణమని రైతులు ఖండించారు. అమరావతిని అభివృద్ధి చేస్తామని నమ్మించి మూడు రాజధానుల పేరుతో వంచించారన్నారు. పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉండే అమరావతిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలతో పాటు తాడికొండ మండలంలోని పలు గ్రామాలలో అమరావతి దీక్షలు కొనసాగాయి. 


వెలగపూడి, మల్కాపురంలో పాదయాత్ర

తిరుపతి వరకు జరిగే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం వెలగపూడి, మల్కాపురంలో  పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ మాట్లాడుతూ అమరావతి మహాపాదయాత్రలో పాల్గొనటం పూర్వ జన్మ సుక్రతమన్నారు. అమరావతి రాష్ట్ర కల్పవృక్షమని కాని ప్రభుత్వం రాజకీయ కుట్రలతో నాశనం చేస్తుందన్నారు. అమరావతిని రక్షించుకోలేకపోతే రైతులతో పాటు ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.  

Updated Date - 2021-10-21T05:40:39+05:30 IST