బావిలో నుంచి వృద్ధురాలి అరుపులు.. బయటకు తీసుకొచ్చాకా ఆమె చెప్పింది విని కంగుతిన్న గ్రామస్తులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-05T17:47:27+05:30 IST

పొలం పనుల నుంచి..

బావిలో నుంచి వృద్ధురాలి అరుపులు.. బయటకు తీసుకొచ్చాకా ఆమె చెప్పింది విని కంగుతిన్న గ్రామస్తులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: పొలం పనుల నుంచి ఇంటికెళ్తున్న కొంతమందికి బావిలోనుంచి ఏవో అరుపులు వినిపించాయి. ఏమైందని బావిలోకి తొంగిచూస్తే.. ఓ వృద్ధురాలు కనిపించింది. ప్రమాదవశాత్తూ కిందపడిందేమోననుకున్నారు. కానీ బయటకు తీసుకొచ్చాకా ఆమె చెప్పింది విని గ్రామస్తులు కంగుతిన్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగింది.


భిల్వారా జిల్లా జహాజ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉలేలా గ్రామానికి చెందిన ఫోరు మీనా అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ 65ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేశాడు. సోమవారం మధ్యాహ్నాం ఆ వృద్ధురాలు తన ఆవును పొలానికి తీసుకెళ్తుండగా ఆ యువకుడు వెనుకాలే వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగి కర్రతో కొట్టడం ప్రారంభించాడు. ‘‘నువ్వో మంత్రగత్తెవి.. నా భార్యలో ఎప్పుడూలేని కొత్తకొత్త అలవాట్లను అలవాటు చేశావు. దీనికంతటికి నువ్వే కారణం..’’అంటూ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమె అక్కడినుంచి పారపోయింది. కానీ ఫోరు మీనా ఆమెను వదలలేదు.



వెనుకాలే వెళ్లి ఓ బావిలోకి తోసేశాడు. కొంతసమయానికి ఆ బావి దగ్గర వెళ్తున్న గ్రామస్తులకు ఆ వృద్ధురాలి అరుపులు వినపడ్డాయి. బావిలో పడిన వృద్ధురాలు తెలివిగా.. బావిలో ఉన్న ఓ పైపును పట్టుకొని తన ప్రాణాలను కాపాడుకుంది. ఏమైందని గ్రామస్తులు అడగగా.. ఆమె విషయం చెప్పింది. ఫోరు మీనాపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


పోలీసుల విచారణలో ఫోరు మీనా వృద్ధురాలిపై దాడి చేయడానికి గల కారణాలను తెలియజేశాడు. తన భార్యలో ఎప్పుడూ లేని కొన్ని భావాలను గమనించానని అందుకు ఆ వృద్ధురాలే కారణమని చెప్పాడు. దేవుడంటే ఇష్టంలేని తన భార్య కొన్నిరోజులుగా పూజలు చేయడం ప్రారంభించిందని చెప్పాడు. సోమవారం పూజలు చేసే సమయంలో వృద్ధురాలిపేరు చెప్పిందని వివరించాడు. ఆ వృద్ధురాలు ఓ మంత్రగత్తె అని, ఆమెను గ్రామంలో లేకుండా చేద్దామనకున్నానని చెప్పాడు. 



Updated Date - 2021-10-05T17:47:27+05:30 IST