కరోనా రోగికి ధైర్యం చెబుతూ పాట పాడిన డాక్టర్లు.. సీఎం ప్రశంసలు..

ABN , First Publish Date - 2020-03-27T22:38:27+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌పై తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్న తరుణంలో... ఓ ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం చక్కటి...

కరోనా రోగికి ధైర్యం చెబుతూ పాట పాడిన డాక్టర్లు.. సీఎం ప్రశంసలు..

జైపూర్: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌పై తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్న తరుణంలో... ఓ ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం చక్కటి పాట పాడి కోవిడ్-19 రోగికి ధైర్యం చెప్పారు. 1960ల్లో వచ్చిన బాలీవుడ్ పాట ‘‘చోడో కల్‌ కీ బాతే.. కల్‌కీ బాత్ పురానీ..’’ అని పాడుతూ అతడిలో స్ఫూర్తి నింపారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరూ తెల్లటి సేఫ్టీ సూట్ ధరించి ఉండగా.. ఓ డాక్టర్ శ్రావ్యంగా పాడుతూ వైద్యుల బృందానికి నేతృత్వం వహించారు. రాజస్థాన్‌లోని భిల్వారా ప్రభుత్వాసుపత్రి వైద్యులు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం ఫిదా అయిపోయారు. తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేసుకుంటూ..


‘‘భిల్వారాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో మా డాక్టర్లు పాట పాడిన ఈ వీడియో చాలా స్ఫూర్తి నింపింది. రాజస్థాన్‌లోని భారత  ప్రజల అవగాహనా స్ఫూర్తికి ఇదే నిదర్శనం. మా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు ధైర్యంగా చికిత్స అందిస్తున్నారు...’’ అని ప్రశంసలు కురిపించారు. వారంతా నిస్వార్థంగా మానవత్వంతో పనిచేస్తున్నారనీ... అలాంటి యోధుల కారణంగా ఈ మహమ్మారిని జయించగలమన్న నమ్మకం తమకు కలిగిందన్నారు. మరోవైపు నెటిజన్ల నుంచి సైతం రాజస్థాన్ డాక్టర్ల బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో కూడా వారు చూపించిన ఆత్మస్థైర్యానికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. 



Updated Date - 2020-03-27T22:38:27+05:30 IST