ఏసీబీ వలలో రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్..?
ABN , First Publish Date - 2021-10-22T07:25:00+05:30 IST
డెవలప్మెంట్ అగ్రిమెంట్ రద్దు కోసం లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అగ్రిమెంట్ రద్దు కోసం లంచం
డాక్యుమెంట్ రైటర్ 5.5 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత
రాజేంద్రనగర్, అక్టోబరు 21 (ఆంద్రజ్యోతి): డెవలప్మెంట్ అగ్రిమెంట్ రద్దు కోసం లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ గురువారం మీడియాకు వెల్లడించారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని గంధంగూడ బస్తీలో గౌరి అనే మహిళకు 300 గజాల స్థలం ఉంది. దానిని డెవలప్ చేయాలని గతంలో ఓ బిల్డర్కు అగ్రిమెంట్ చేశారు. అయితే బిల్డర్ ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. దీంతో గౌరి తాను చేసిన అగ్రిమెంట్ను రద్దు చేయాలనుకుంది. వరుసకు కొడుకు అయ్యే అర్వింద్ కుమార్ ద్వారా రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ మీర్ హర్షద్ అలీని కలిశారు. అగ్రిమెంట్ రద్దు చేయాలంటే రూ.5.5 లక్షలు ఇవ్వాలని.. అందులో రూ.5 లక్షలు సబ్ రిజిస్ట్రార్కు, రూ.50 వేలు డాక్యుమెంట్ రైటర్ వాసుకు అని మాట్లాడుకున్నారు. గురువారం డాక్యుమెంట్ రైటర్ వాసు.. అర్వింద్కుమార్ దగ్గర రూ.5.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ డబ్బులు తీసుకోలేదని, కానీ రూ.5 లక్షలు ఇస్తేనే అగ్రిమెంట్ను రద్దు చేస్తామని అర్వింద్కుమార్తో మాట్లాడిన వివరాలు తమ వద్ద ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ను అరెస్ట్ చేశామని, వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తామని పేర్కొన్నారు.