త్వరలో రజనీతో అమిత్ షా భేటీ.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2020-11-16T16:57:58+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన విజయవంతం చేయాలని

త్వరలో రజనీతో అమిత్ షా భేటీ.. ఏం జరుగుతుందో..!?

  • వ్యూహరచనలో బీజేపీ
  • 21న కేంద్ర హోం మంత్రి రాష్ట్ర పర్యటన

చెన్నై : ఈనెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులు అమితాశక్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే యేడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో జరుగనున్న నేపథ్యంలో అమిత్‌షా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. అమిత్‌షా తన పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్‌ నేతలు, జిల్లా శాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన వ్యూహరచనలు చేయనున్నారు. అమిత్‌షాకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు మురుగన్‌, పార్టీ ప్రముఖులు అప్పుడే   సన్నాహాల్లో మునిగారు. అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే, డీఎంకే, మక్కల్‌నీదిమయ్యం పార్టీలు అప్పుడే వ్యూహరచన చేయడంలో బిజీగా వుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే   కూటమిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీలున్నాయి. ప్రస్తుతం డీఎంకూ కూటమి బలంగా కనిపిస్తోంది. అయితే అధికార అన్నాడీఎంకే కూటమిలో అనిశ్చిత పరిస్థితులు కొనగసాగుతున్నాయి. బీజేపీ, పీఎంకే, డీఎండీకేల కూటమి పై రోజుకో విధంగా ప్రకటనలు వస్తున్నాయి. ఈసారి బీజేపీ నాయకత్వంలోనే మెగా కూటమి ఏర్పాట వుతుందని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మురుగన్‌ ఆ మధ్య ప్రకటించి కలకలం సృష్టించారు.  మంత్రి డి.జయకుమార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోనూ బలమైన కూటమి ఏర్పాటవుతుందని, ఆ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.


అన్నాడీఎంకే కూటమిలోని చిన్నాచితక పార్టీలు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కువగా సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నాయి. అదే సమయంలో ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు సీమాన్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి, టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం, ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల గెలుపోటములను తీర్మానించే విధంగా రోజురోజుకూ బలపడుతున్నాయి. బిహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీ, ఒవైసీ మజ్లిస్‌ పార్టీల వల్ల ప్రముఖ పార్టీలు ఓటమి పాలైన విషయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అధిష్టానవర్గాలు గమనించి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి  రాకుండా జాగ్రత్త వహించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యటనకు వస్తున్న  అమిత్‌షా బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు, జిల్లా కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై స్థానిక శాఖ నాయకుల నుంచి నివేదికలను తెప్పించుకున్న అమిత్‌షా వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి తగిన వ్యూహ రచన కూడా చేయనున్నారని తెలుస్తోంది.


మళ్ళీ వెట్రివేల్‌ యాత్ర

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ మళ్ళీ వెట్రివేల్‌ యాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల ఆరు నుంచి డిసెంబర్‌ ఆరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వెట్రివేల్‌ యాత్ర జరుపనున్నట్టు మురుగన్‌ ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఆ యాత్రకు అనుమతివ్వలేదు. పోలీసుల అనుమతి లేకుండా తిరుత్తణిలో, చెన్నై తిరువొత్తియూరులో వేల్‌ యాత్ర నిర్వహించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ సహా పార్టీ నేతలు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ ముందుగా ప్రకటించినట్టు ఈనెల 17న తిరువణ్ణామలైలో వేల్‌ యాత్రను మళ్ళీ ప్రారంభించనున్నట్టు మురుగన్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరువణ్ణామలైలో తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండటంతో యాత్ర కొనసాగించేలా విల్లుపురం, కడలూరు జిల్లాల్లో పార్టీ సీనియర్‌ నాయకులు సీపీ రాధాకృష్ణ్ణన్‌, పొన్‌ రాధాకృష్ణన్‌ వేల్‌యాత్రకు నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు.


రజనీతో భేటీ?

ఇదిలా ఉండగా ఈ నెల 21న రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెన్నైలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కలుసుకోనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కరోనా లాక్‌డౌన్‌, తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ పార్టీని ఇప్పట్లో ప్రారంభించే ఉద్దేశం లేదంటూ ఇటీవలే రజనీకాంత్‌ ప్రకటించారు. అయితే రజనీకాంత్‌ మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పలుమార్లు ప్రకటనలు చేసి ఆ పార్టీకి, పార్టీ జాతీయనాయకులకు దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ మద్దతు పొందితే బాగుంటుందని అమిత్‌ షా భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ మేరకు తన పర్యటనలో భాగంగా ఆయన రజనీకాంత్‌ను కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ భేటీలో ఇద్దరి మధ్య ఏయే విషయాలపై చర్చలు జరుగుతాయి..? షా ఏం చెప్పబోతున్నారు..? రజనీ ఎలా రియాక్ట్ అవుతారు..? అసలేం జరుగుతుందో అని అటు అభిమానులు.. ఇటు రాజకీయ నేతల్లోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఉత్సాహాన్ని నింపిన పశ్చిమ బెంగాల్‌ పర్యటన

వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్‌లో అమిత్‌షా ఇటీవల చేసిన పర్యటన ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమిలో ఉత్సాహాన్ని నింపింది. అమిత్‌షా పర్యటనతో మును పెన్నడూ లేనంతగా పార్టీ బలం పుంజుకుందని, పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో ఉన్నారని ఆ రాష్ట్ర బీజేపీ నేతులు చెబుతున్నారు. అదే రీతిలో అమిత్‌షా ఈనెల 21న జరుపనున్న రాష్ట్ర పర్యటన కూడా బీజేపీలో నూతనోత్తేజం కలిగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ చెబుతున్నారు. వెట్రివేల్‌ యాత్రతో ఇమేజ్‌ను పెంచుకుంటున్న బీజేపీకి అమిత్‌షా రాష్ట్ర పర్యటన మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. అమిత్‌షాకు పార్టీ తరఫున ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టనున్నట్టు తెలిపారు. అమిత్‌షా పర్యటన తర్వాత బీజేపీ బలం తప్పకుండా పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-16T16:57:58+05:30 IST