తిరుచ్చిలో టపాసులు కాల్చుతూ రజినీ అభిమానుల సంబరాలు

ABN , First Publish Date - 2020-12-03T22:21:56+05:30 IST

తమిళనాడులోని తిరుచ్చిలో సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి రజినీ రాజకీయ ఆరంగేట్రంపై...

తిరుచ్చిలో టపాసులు కాల్చుతూ రజినీ అభిమానుల సంబరాలు

తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిలో సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి రజినీ రాజకీయ ఆరంగేట్రంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం ఆయన చేసిన ప్రకటనతో శుభం కార్డు పడటంతో ఆయన అభిమానులు ఊరూరా సంబరాలు చేసుకుంటున్నారు. 2021, జనవరిలో తన రాజకీయ పార్టీ ఆవిర్భావం ఉండనున్నట్లు రజినీకాంత్ గురువారం స్పష్టం చేశారు. దీంతో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటున్నట్లు తేలిపోయింది. అంతేకాదు, రజినీ రాజకీయ పార్టీ పేరు, విధి విధానాలపై డిసెంబర్ 31నే ఓ క్లారిటీ రానున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఇప్పటికే కమల్‌హాసన్ పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.


ఇదిలా ఉంటే, రజినీ రాజకీయాల్లోకి రావాలని భావించినప్పటి నుంచి ఆయన పార్టీ స్థాపించినప్పటికీ.. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ సాగింది. నీతివంతమైన ఆధ్యాత్మిక రాజకీయాలు అందిస్తానని రజినీ గతంలో చేసిన ప్రకటనే ఇందుకు కారణం. రజినీ ఆధ్యాత్మిక రాజకీయాలు.. బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని.. ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరిగింది. పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ తాజా ప్రకటనతో ఈ చర్చ మరోసారి తెరపైకొచ్చింది.



Updated Date - 2020-12-03T22:21:56+05:30 IST