కరోనా కట్టడికి సమన్వయంతో పని చేయండి
ABN , First Publish Date - 2020-04-06T10:15:20+05:30 IST
కరోనా మహమ్మారిని అరికట్టడానికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌభ ఆదేశించారు.
అధికారులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కేబినెట్ సెక్రటరీ ఆదేశం
విశాఖపట్నం, ఏప్రిల్ 5, (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారిని అరికట్టడానికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌభ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్, పోలీస్, ఆరోగ్యశాఖ అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ సర్వీస్మెన్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, ఎన్సీపీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు శిక్షణ అందించి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మందుల తయారీకి సంబంధించి ఫార్మాస్యూటికల్ కంపెనీలు పని చేసేలా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, సంస్థలను, కళాశాలలను ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వి.వినయ్చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీఐజీ కె.రంగారావు, ఎస్పీలు అట్టాడ బాబూజీ, రాహుల్ దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ ఎల్.శివ శంకర్, వేణుగోపాల్రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వరతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.