సీపీఐ నేత నా గొంతు పిసికేశాడు: రాజ్యసభ మార్షల్
ABN , First Publish Date - 2021-08-13T08:48:42+05:30 IST
బుధవారం సాయంత్రం రాజ్యసభలో జనరల్ ఇన్సూరెన్స్ బీమా బిల్లును ఆమోదించే సమయంలో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బిల్లు చర్చ సమయంలో..
న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రం రాజ్యసభలో జనరల్ ఇన్సూరెన్స్ బీమా బిల్లును ఆమోదించే సమయంలో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బిల్లు చర్చ సమయంలో ప్రతిపక్షాలు నిరసన తెలుపడం, వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించడం.. ఈ సమయంలో ఎంపీలకు, మార్షల్స్ మధ్య తోపులాట చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. తమపై అధికార పక్షం మార్షల్స్తో దాడి చేయించిందని, ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రతిపక్షాలు ఆరోపించగా.. అధికార పక్షం మాత్రం ప్రతిపక్షాల మాటలను ఖండించింది.
ఈ క్రమంలోనే రాజ్యసభ మార్షల్స్లో ఒకరు తనపై సీపీఐ ఎంపీ దాడి చేశారని తన గొంతు నులిమేశారని ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సెక్యూరిటీ అసిస్టెంట్ రాకేశ్ నేగి.. రాజ్యసభలోని పరిస్థితిపై తనపై అధికారికి వివరణ ఇస్తూ ఓ లేఖ రాశారు. అందులో.. సీపీఐ నేత, ఎంపీ ఎలమరన్ కరీమ్ తనపై దాడి చేశారని, తన గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేశారని రాసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్ష ఎంపీలో సభ రక్షణ వలయాన్ని విరగ్గొట్టేందుకు ప్రయత్నించాలని కూడా తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం ఈ లేఖపై సంచలనంగా మారింది.