ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ABN , First Publish Date - 2021-08-12T01:21:09+05:30 IST

ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఓబీసీ జాబితాను రూపొందించే అధికారాలను..

ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ: ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఓబీసీ జాబితాను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు కల్పిస్తూ రాజ్యసభలో కేంద్రం బుధవారంనాడు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు తెలిపారు. దీనికి ఒకరోజు ముందు మంగళవారంనాడు ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. 385 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయలేదు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 187 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష సభ్యులు చేసిన కొన్ని సవరణలను సభ తోసిపుచ్చింది.


సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ జాబితాలను తయారు చేసుకునే అధికారాలను పునరుద్ధరించేదుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆయన సభకు తెలిపారు. పెగాసస్, సాగు చట్టాలపై చర్చించాలంటూ పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనలు కొనసాగిస్తున్న నేపధ్యంలో బుధవారంనాడు ఈ బిల్లుపై సుమారు 5 గంటల పాటు చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులతో పాటు విపక్ష నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. రాజ్యాంగంలోని 368వ అధికరణ ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం ఉంటుంది. సభలో హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ లభించాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-08-12T01:21:09+05:30 IST