ప్రత్యేక హోదాపై రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లిన విజయసాయి
ABN , First Publish Date - 2021-07-19T21:32:58+05:30 IST
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో వెల్లోకి దూసుకెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏడేళ్ళు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేసి ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు రూల్ 267 కింద విజయసాయిరెడ్డి నోటీసును అందించారు.
అయితే ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నట్లుగా సభాధ్యక్షులు ప్రకటించడంతో విజయసాయిరెడ్డి సభలోని వెల్లోకి దూసుకువెళ్లారు. ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీ సభ్యులు వెల్లోకి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ ఈ రోజు చర్చకు అనుమతించలేను’’ అని తెలిపారు. సభలో విజయసాయిరెడ్డితో పాటు ఇతర పార్టీ సభ్యులు వెల్లో ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధానమంత్రి మౌనంగా వారిని వీక్షిస్తూ కనిపించారు.