కేంద్ర మంత్రిని అరెస్టు చేయకుంటే నిరనసలు తీవ్రం: టికాయత్
ABN , First Publish Date - 2021-10-18T21:46:15+05:30 IST
లఖింపూర్ హింసాత్మక ఘటనలో ప్రమేయానికి గాను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తక్షణం..
న్యూఢిల్లీ: లఖింపూర్ హింసాత్మక ఘటనలో ప్రమేయానికి గాను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తక్షణం తొలగించి, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేందుకు వీలుగా ఆయనను అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. సోమవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించ కుంటే లఖింపూర్ హింసాత్మక ఘటనపై నిరసనలను మరింత తీవ్రం చేస్తామని అన్నారు.
లఖింపూర్ ఘటనపై దర్యాప్తు పట్ల టికాయత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ''అజయ్ మిశ్రాపై సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేయాలి. ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రైతులను ఆయన హెచ్చరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. లఖింపూర్ ఘటన వెనుక ఆయన ఉన్నారు''అని టికాయత్ అన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా, ఆరెస్టుకు ఒత్తిడి తీసుకురావడం కోసమే రైల్రోకో జరుపుతున్నామని, మంత్రిని ఆ పదవి నుంచి తప్పించనంత వరకూ నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని అన్నారు. రైతులపై కార్లు నడిపి వారి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు 'రెడ్ కార్పొట్' అరెస్టు చేయడం రైతుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతోందని అన్నారు. సిట్ దర్యాప్తును మంత్రి ప్రభావితం చేస్తున్నారని టికాయత్ ఆరోపించారు.
సింఘా సరిహద్దులో ఒక వ్యక్తి దారుణంగా హత్యు గురైన సంఘటనపై అడిగిన ప్రశ్నపై టికాయత్ స్పందిస్తూ, ఇది మతపరమైన అంశమే కానీ, రైతుల నిరసనలతో ఎట్టి సంబంధం లేదని ఇప్పటికే నిహాంగ్లు వివరణ ఇచ్చారని చెప్పారు.