నిరాడంబరంగా.. రంజాన్
ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST
రంజాన్ పండగను ముస్లింలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నిరాడంబరంగా జరుపుకున్నారు.
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిరాడంబరంగా జరుపుకున్నారు. నెలరోజుల నుంచి చేస్తున్న ఉపవాస దీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో సామూ హికంగా మజీద్లకు వెళ్లే అవకాశం లేక పోవడంతో ఎవరి ఇళ్లలో వారు ప్రార్ధనలు చేశారు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : రంజాన్ పండగను ముస్లింలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రార్థనలకు మసీదులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా సామూహిక ప్రార్థనలకు ముస్లింలు దూరమై.. ఎవరి ఇంట్లో వారు ప్రార్థనలు చేసుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. భౌతికదూరం పాటిస్తూ.. ఒకరికొకరు ఈద్ముబారక్ చెప్పుకున్నారు. ఈసారి ఆలింగనాలకు దూరంగా ఉన్నారు.
వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఘట్కేసర్లో మొదటిసారి రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనలు జరగలేదు. ప్రతి రంజాన్కు వేలాది మందితో ఈద్గా మైదానం కిటకిటలాడేది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈద్గాల వద్ద ముస్లింలు చాలా తక్కువగా కనిపించారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద ఉన్న ముస్లింలను పోలీసులు పంపించేశారు. వివిధ పార్టీల నేతలు ముస్లింలకు వాట్సాప్, మెసేజ్ల ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంట్లోనే గుమగుమలాడే వంటకాలు తయారు చేసుకుని ఆరగించారు.