వైసీసీ ప్రభుత్వం ప్రమాదకరంగా మారింది: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-09-07T16:24:08+05:30 IST

రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన అంతా నా ఇష్టం అన్న విధంగా సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ విమర్శించారు.

వైసీసీ ప్రభుత్వం ప్రమాదకరంగా మారింది: రామకృష్ణ

తిరుపతి: రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన అంతా నా ఇష్టం అన్న విధంగా సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని, జగన్ ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. పరిపాలన రివర్స్‌లో ఉందని, ప్రభుత్వంతో ఒప్పందం అంటేనే  కాంట్రాక్టర్లు భయపడి పోతున్నారని అన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. గత రెండేళ్లలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.


సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవంలో జగన్ చెప్పిందొకటి.. చేసేదిమరొకటని రామకృష్ణ విమర్శించారు. అర్హులైన వారి పెన్షన్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 9న విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, రోడ్ల దుస్థితి, పెన్షన్ రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, కేంద్రం తానా అంటే తందానా అంటూ సీఎం జగన్ భయంతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఈనెల 14వ తేదీన అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించి విశాఖలో పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 21న వైజాగ్‌లో విశాఖ ఉక్కుపై భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-07T16:24:08+05:30 IST