మంత్రులు మారేటపుడు జగన్‌కు మాత్రం ఏ ప్రత్యేకత ఉందని కొనసాగటానికి?: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-10-29T18:01:42+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులను జీరోలుగా భావిస్తున్నారని రామకృష్ణ అన్నారు.

మంత్రులు మారేటపుడు జగన్‌కు మాత్రం ఏ ప్రత్యేకత ఉందని కొనసాగటానికి?: రామకృష్ణ

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులను జీరోలుగా భావిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రులు తన పక్కన ఉంటేనే వారికి విలువ అన్నట్టు సీఎం చూస్తున్నారని, వారిని త్వరలోనే తొలగించి కొత్తవారిని నియమించబోతున్నారని.. మరి మంత్రులు మారేటపుడు జగన్‌కు మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఏం ప్రత్యేకత ఉందని ప్రశ్నించారు. తట్టమట్టి వేసి రోడ్డులో గుంత కూడా పూడ్చలేని విధంగా ప్రభుత్వం దివాళ తీసిందని విమర్శించారు. కొత్త సర్పంచుల వద్ద డబ్బులు కూడా సీఎం లాగేసుకున్నారని ఆరోపించారు.


ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వటం లేదని, డి.ఏ పెండింగ్‌లో ఉందని, సీపీఎస్ రద్దు చేయలేదని రామకృష్ణ విమర్శించారు. రెండేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఏ రంగంలో అయినా, ఏ జిల్లాలో అయినా అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎంత అప్పు చేశారు.. జగన్ ఇప్పటికే ఎంత అప్పు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. ఇది దుర్మార్గం కాదా? అని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-10-29T18:01:42+05:30 IST