ఏపీలో అరాచకపాలనకు జగనే కారణం: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-08-11T19:18:15+05:30 IST
ఏపీలో పోలీసులు శృతిమించుతున్నారని, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టి..
విజయవాడ: ఏపీలో పోలీసులు శృతిమించుతున్నారని, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టి చంపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అరాచకపాలనకు సీఎం జగనే కారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పోలీసులు ఇంత దిగజారడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అమరావతి రైతులు న్యాయం స్థానం నుంచి దేవస్థానం వరకు ర్యాలీగా వెళతామన్నారు. వారు శాంతియుతంగా చేస్తామంటే.. 3వేల మంది పోలీసులు, వంద చెక్ పోస్టులు పెట్టి రైతులను అణచివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అలాగే పులివేందులలో ఓ వ్యక్తిని పోలీసులు లాకప్లో పెట్టి.. విచారణ పేరుతో కొట్టి చంపారని.. చనిపోయిన వ్యక్తి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు లేకుండా చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పులివెందులలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయన్నారు. ఈ లాకప్ డెత్పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, ఎస్ఐ గోపినాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పూర్తిగా విఫలమయ్యారని రామకృష్ణ అన్నారు.