Ramappa సంరక్షణపై హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-07-28T19:40:31+05:30 IST

రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పత్రికల కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది.

Ramappa సంరక్షణపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పత్రికల కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. యునెస్కో విధించిన గడువు డిసెంబరు నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆగస్ట్ 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది. 


రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం తెలంగాణకు గర్వ కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని ఆదేశాల్లో తెలిపింది. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మారుతుందని హైకోర్టు చెప్పింది. రామప్ప కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైనదని, యునెస్కో విధించిన గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలని సూచించింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని హెచ్చరించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని, కాలపరిమితులు విధించుకొని పని చేయండని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-28T19:40:31+05:30 IST