కేసీఆర్ గారు మళ్లా కరోనాకు పారాసిట్‌మల్ చాలంటున్రు: రాములమ్మ

ABN , First Publish Date - 2021-06-22T14:22:18+05:30 IST

ఎన్నో వాగ్దానాలు చేసి.. వాటి ఊసెత్తకుండా కొత్తగా అబద్ధాలు చెబుతున్నారని.. తుగ్లక్ తీరున వాగ్దానాలు చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు

కేసీఆర్ గారు మళ్లా కరోనాకు పారాసిట్‌మల్ చాలంటున్రు: రాములమ్మ

హైదరాబాద్: ఎన్నో వాగ్దానాలు చేసి.. వాటి ఊసెత్తకుండా కొత్తగా అబద్ధాలు చెబుతున్నారని.. తుగ్లక్ తీరున వాగ్దానాలు చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. తెలంగాణ ప్రజలు అమాయకులనా.. లేదంటే సీఎం గారి మానసిక స్థితి సరిగా లేక ఇదంతా జరుగుతున్నదా? అని ఆమె ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా... ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు. వీటిలో ఏ ఒక్కటీ ఇంతకుముందు జరగలేదు.


ధనిక రాష్ట్రం అని చెప్తున్న ఈ సీఎం గారు, మరి పైసలున్నప్పుడు గవన్నీ ఎందుకు చెయ్యలేదు? కేవలం చేసేది ఇష్టం లేకనా... కాదంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నట్లా? వరంగల్ ఐటీ హబ్ అన్నరు... డబుల్ బెడ్రూం ఇళ్ళన్నరు... కుర్చీ వేసుకు కూర్చుని పూర్తి చేసి కల్లు తాగి దావత్ చేసుకుంటానన్నరు... ఇవన్నీ ఏమైనవో తెల్వదు. ఇప్పుడు మల్లా తుగ్లక్ తీరున ఈ వాగ్దానాలు. తెలంగాణ ప్రజలు అమాయకులనా... లేక ఈ సీఎం గారి మానసిక పరిస్థితి సరిలేక ఇదంతా జరుగుతున్నదా?.. అని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. అసలు అమలు కాని, అమలు చెయ్యని ఇలాంటి అవకతవక, అనాలోచిత హామీలు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు జిల్లాలు పర్యటించుడు... వారి ఆలోచన సమతుల్యతను సందేహించాల్సినట్లుందనే అభిప్రాయాలు తెలంగాణ సమాజంలో బలపడుతున్నాయి.’’ అని రాములమ్మ పేర్కొన్నారు.



Updated Date - 2021-06-22T14:22:18+05:30 IST