పసిపాపలు, వృద్ధురాళ్లను సైతం వదలట్లేదు.. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది: రాములమ్మ

ABN , First Publish Date - 2021-09-13T16:08:18+05:30 IST

ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. లోకం తెలియని పసిపాపల్ని... రేపోమాపో అంటూ కాటికికాళ్ళు చాపిన వృద్ధురాళ్లను సైతం కామాంధులు వదలని తీరు చూస్తుంటే..

పసిపాపలు, వృద్ధురాళ్లను సైతం వదలట్లేదు.. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది: రాములమ్మ

హైదరాబాద్: ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. లోకం తెలియని పసిపాపల్ని... రేపోమాపో అంటూ కాటికికాళ్ళు చాపిన వృద్ధురాళ్లను సైతం కామాంధులు వదలని తీరు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందన్నారు. ఆడ పిల్లలపై బయటి వ్యక్తులే కాదు... తోడబుట్టినవారు, జన్మనిచ్చినవారు కూడా పాపాలకు ఒడిగడుతున్న సంఘటనలో రోజూ ఎక్కడో ఒక చోట తరచుగా బయటపడుతున్నాయని రాములమ్మ పేర్కొన్నారు.





‘‘ఎలాంటి సమాజాన్ని మనం తయారుచేసుకుంటున్నామో అర్థంకాని పరిస్థితులు నన్ను ఎంతో వేదనకు గురిచేస్తున్నాయి. వైజ్ఞానికంగా ఎంతో ఎదిగిపోయామని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ... నైతికంగా ఎంత పతనమైపోయామన్నది గుర్తించలేక పాతాళంలోకి కూరుకుపోతున్నాం. లోకం తెలియని పసిపాపల్ని... రేపోమాపో అంటూ కాటికికాళ్ళు చాపిన వృద్ధురాళ్ళను సైతం కామాంధులు వదలని తీరు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. రెండేళ్ళ కిందట వరంగల్ జిల్లాలో 9 నెలల పసికందుపై ఒక నీచుడు చేసిన దారుణం... ఆ తర్వాత జరిగిన దిశ విషాద ఘటన... ఇంకా ఇలాంటి మరి కొన్ని అమానుష సంఘటనల్ని మర్చిపోక ముందే ఇప్పుడు హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి మరో మృగాడి చేతిలో బలైపోయిన దుర్వార్త వినాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి యావత్ సమాజం బాధ్యత వహించాలి. ఏటేటా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా నాలుగు నీతులు వల్లెవేసుకుని... నేతల పరామర్శలు... ఛానెళ్ళలో డిబేట్లు... పత్రికల్లో కథనాలతో వదిలేస్తున్నాం తప్ప ఇలాంటి మరో సంఘటన జరుగకుండా ఏం చర్యలు తీసుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచిస్తే.... సమాజంలోని ప్రతి వ్యక్తినీ దోషిగా నిలబెట్టాల్సి వస్తుంది.



ఆడ పిల్లలపై బయటి వ్యక్తులే కాదు... తోడబుట్టినవారు, జన్మనిచ్చినవారు కూడా పాపాలకు ఒడిగడుతున్న సంఘటనలో రోజూ ఎక్కడో ఒక చోట తరచుగా బయటపడుతున్నాయి. నేరస్తుల్లో మైనర్లు, మేజర్లు, వృద్ధులు కూడా ఉండటం.... పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సైతం ఆడపిల్ల భయాందోళనల మధ్య బతకాల్సి రావడం... చూస్తుంటే విస్మయం కలుగుతోంది. ఈ దుస్థితి నుంచి మన సమాజాన్ని సంస్కరించుకోలేమా... ఎప్పటికీ బాగుపడలేమా?... ఆలోచించండి. మాటలు తప్ప.... గంజాయి, గుడుంబా, డ్రగ్స్ పట్ల అనేక సాకులతో... నిష్క్రియాపరత్వంతో వ్యవహరిస్తున్న టీఆరెస్ ప్రభుత్వ నేతల వైఖరి కూడా ఈ దుష్కృత్యాలకు ఒక కారణంగా కనబడుతుండటం సిగ్గు చేటు’’ అని రాములమ్మ పేర్కొన్నారు.




Updated Date - 2021-09-13T16:08:18+05:30 IST