నెలవంక తొంగిచూసింది..
ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మంది ముస్లింలు సంప్రదాయ బద్ధంగా ఉపవాసాలు ఆచరించే రంజాన్ పవిత్ర మాసం రానే వచ్చింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం (మగ్రిబ్) నెలవంక దర్శనమైనట్లు రుయాతే హిలాల్ హైదరాబాద్ (దక్కన్) కమిటీ ప్రకటనను జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మసీదుల్లో సాయంత్రం ముస్లిం మత పెద్దలు సైరన్ మోగించి సంకేతమిచ్చారు. ఒకరికి ఒకరు చాన్ ముబారక్ (నెలవంక దర్శనం) శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాత్రి 8గంటల సమయం ఇషా నమాజు తర్వాత తరవీహ్ నమాజ్లుచేశారు. బుధవారం సహర్తో ఉపవాసాలు (రోజా) ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఉపవాసాలు చేసి చివరి రోజున సాయంత్రం (ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం సూర్యుడు అస్తమించాక మరో రోజు ప్రారంభమవుతుంది.) నెలవంకను చూసి తెల్లవారాక మొదటి రోజున ఈద్-ఉల్-ఫిత్ర్ రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఈ లెక్కన మే 14న రంజాన్ పండుగ ఉంటుందని ముస్లిం మత పెద్దలు స్పష్టం చేస్తున్నారు.
ప్రారంభమైన ముస్లింల పవిత్ర రంజాన్ మాసం
నేటి నుంచి ఆరంభమైన ఉపవాస దీక్షలు
మత సామరస్యం, భక్తిభావానికి ప్రతీక
కొవిడ్ నిబంధనలకు లోబడి మసీదుల్లో ప్రార్థనలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మంది ముస్లింలు సంప్రదాయ బద్ధంగా ఉపవాసాలు ఆచరించే రంజాన్ పవిత్ర మాసం రానే వచ్చింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం (మగ్రిబ్) నెలవంక దర్శనమైనట్లు రుయాతే హిలాల్ హైదరాబాద్ (దక్కన్) కమిటీ ప్రకటనను జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మసీదుల్లో సాయంత్రం ముస్లిం మత పెద్దలు సైరన్ మోగించి సంకేతమిచ్చారు. ఒకరికి ఒకరు చాన్ ముబారక్ (నెలవంక దర్శనం) శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాత్రి 8గంటల సమయం ఇషా నమాజు తర్వాత తరవీహ్ నమాజ్లుచేశారు. బుధవారం సహర్తో ఉపవాసాలు (రోజా) ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఉపవాసాలు చేసి చివరి రోజున సాయంత్రం (ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం సూర్యుడు అస్తమించాక మరో రోజు ప్రారంభమవుతుంది.) నెలవంకను చూసి తెల్లవారాక మొదటి రోజున ఈద్-ఉల్-ఫిత్ర్ రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఈ లెక్కన మే 14న రంజాన్ పండుగ ఉంటుందని ముస్లిం మత పెద్దలు స్పష్టం చేస్తున్నారు.
మహబూబాబాద్ (ఆంధ్రజ్యోతి):
మత సామరస్యం, భక్తిభావానికి ప్రతీక అయిన విశిష్టమై న, శుభప్రదమైన రంజాన్ మాసం ఆరంభమైంది. ఈ నెల రోజులు ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున నిర్ణీత వేళలో సహర్ పేరిట భోజనం ముగించుకుని అప్పటి నుంచి ఉపవాస దీక్ష లు ప్రారంభిస్తారు. తిరిగి సూర్యాస్తమయమయ్యాక సాయంత్రం ఇఫ్తార్తో దీక్షను డ్రైఫ్రూట్ లేదా పండ్లు, ఫలాలతో విరమిస్తారు. అనంతరం యథావిధిగా భోజ నం తీసుకుంటారు. ఈ మాసం లో ముస్లింలు నిత్యం ఐదు సార్లు నమాజ్ చేయడం, అనుక్ష ణం అల్లా్హను స్మరిస్తుంటారు. యేటా రంజాన్మాసం రెండు నెల లు ముందుకు వస్తుంటుంది. ఆ క్రమం లో ఈసారి వేసవిలో ఉపవాస దీక్షామాసం ప్రారంభం అయ్యాయి.
మనో నిగ్రహం
రంజాన్ మాసానికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ‘రమ్జ్’ అంటే అరబిక్లో ‘కాలడం’ అని అర్థంగా పెద్దలు విశ్లేషిస్తారు. ఈ నెల రోజుల ఉపవాస దీక్షలో శరీరాన్ని సుష్కింపజేయడం ద్వారా ఆత్మప్రక్షాళనతో సర్వపాపాలు సమసిపోతాయని ముస్లింల విశ్వాసం. ఆ క్రమంలోనే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉండి మనోనిగ్రహం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉపవాస దీక్షలతో ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సహనం, ధాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం తదితర ఉత్తమ గుణా లు ఆలవడుతాయని చెబుతారు.
దివ్య ఖుర్ఆన్
రంజాన్ మాసంలోనే హజ్రత్ జిబ్రాయీల్ అలై సలాం యేటామహా ప్రవక్తకు దివ్య ఖుర్ ఆన్ సంపూర్ణంగా వినిపించే వారు. రంజాన్ ఆరంభంతోనే ‘తరావీహ్’ నమాజ్ ఆదేశించబడింది. వేయి రాత్రులకంటే పుణ్య ప్రదమైన రాత్రి ‘లైలతుల్ ఖద్ర్’ ఈ నెలలోనే ఉంది. ఆర్థిక ఆరాధనైన ‘జకాత్’ చెల్లించడం.. నిరుపేదల హక్కు అయిన ‘ఫిత్రా’ చెల్లించడం.. దైవ ప్రసన్నత చూరగొనే వనవ్రతం (ఏతెకాఫ్) పాటించడం.. మహాప్రవక్తకు రమజాన్ మాసం 21వ తేదీన ప్రవక్త పదవి లభించింది.
ఖర్జూరంతో దీక్ష విరమణ
రంజాన్ మాసంలో తెల్లవారుజామున ‘సహర్’ సమయంలో ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత ‘ఇఫ్తార్’ విందుతో దీక్షవిరమణ సందర్భంలో ఖర్జూరం తప్పనిసరి తీసుకుంటారు. ప్రవక్త హజ్రత్ మహ్మద్ ఖర్జూరం పళ్లతోనే ఉపవాస దీక్ష విరమించేవారని ముస్లిం విశ్వాసం. అందుకనే ఖర్జూరం పండ్లతో దీక్ష విరమించడం పవిత్రకార్యంగా భావిస్తారు.
ఉపయోగాలు
రమజాన్ ఉపవాస దీక్షలతో దైవ భక్తియే కాకుండా ఆరోగ్య రీత్యా మేలు చేకూరుతోందని వైద్యశాస్త్రం చెబుతోంది. పగలంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతకాలం జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించి జీర్ణక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. మితాహారానికి ఆలవాటు పడడంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. పగలంతా కనీసం నీరు కూడా తాగకపోవడం వల్ల శరీరంలోని వివిధ రసాల ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. ఉపవాసాల అనంతరం తగిన మోతాదులో ఫలాలు, మాంసకృత్తులు తీసుకోవచ్చు. ఉపవాస దీక్షలతో రక్తపోటు కొలస్ర్టాల్ తగ్గిపోతాయని వైద్య పరిశోధనల్లో తేలింది.
ఆకలి బాధను గుర్తెరిగే ‘రోజా’..
రంజాన్ ఉపవాస దీక్షగా వ్యవహరించే ‘రోజా’ను అరబిక్ భాషలో ‘సౌమ్’, ‘సియామ్’ అని అంటారు. సౌమ్ అంటే మా నుకొనుట, ఆపుట, ఆగుట, కట్టుబడి ఉండుట అనే అర్థాలు వస్తాయి. ఉపవాసిని ‘సాయమ్’ అని అంటారు. ఇస్లామియా పరిభాషలో ప్రభాత పూర్వ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు త్యజించడం ఈ ఉపవాస దీక్షకు పరమార్థంగా పేర్కొంటారు. ఈ ఉపవాసదీక్షలతో నిర్మలమైన, నిశ్చలమైన భక్తి భావం ఏర్పడడమే కాకుండా ఆకలి బాధతో అల్లాడే దీనజనుల కష్టాలను స్వయంగా ఉపవాస దీక్షల ద్వారా గుర్తించే అవకాశం లభిస్తుందని చెబుతారు.
కొవిడ్ నిబంధనలకు లోబడి..
గతేడాది కొవిడ్ ఉధృతంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ముస్లింలంతా ఎవరి ఇంటి వద్ద వారే ఉపవాస దీక్షలు కొనసాగించారు. దీంతో సామూహికంగా మసీదుల్లో దీక్షల విరమణ చేయడం, రాత్రుళ్లు తరావీహి ప్రత్యేక నమాజ్లు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు బ్రేక్ పడింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతోపాటు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది సామూహిక ప్రార్థనలపై ఎలాంటి అంక్షలు విధించలేదు. కొద్దికాలంగా కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్లు, శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం నిబంధనలను అనివార్యం చేస్తూ ప్రభుత్వం కలెక్టర్, ఎస్పీలను అప్రమత్తం చేసింది. దీనికనుగుణంగా అధికారయంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలకు లోబడి రంజాన్ మాసాన్ని ముస్లింలు ఆచరించనున్నారు.