సూర్యాపేటలో అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2022-01-20T07:11:08+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తలపై భాగం మూడు ముక్కలైతే ప్రాణంపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి స్థితిలోని వ్యక్తికి వైద్యులు ప్రాణం పోశారు.

సూర్యాపేటలో అరుదైన చికిత్స
బాధితుడిని పరామర్శిస్తున్న జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి వెంకటరమణ

 తల పైభాగం మూడు భాగాలైన వ్యక్తి క్షేమం

సూర్యాపేట అర్బన్‌, జనవరి 19: రోడ్డు ప్రమాదంలో తలపై భాగం మూడు ముక్కలైతే ప్రాణంపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి స్థితిలోని వ్యక్తికి వైద్యులు ప్రాణం పోశారు. ఈ అరుదైన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రం జమ్మిగడ్డలోని హెల్తీఫై ఆస్పత్రిలో ఈ నెల 16వ తేదీన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు బుధవారం తెలిపారు. సూర్యా పేట చర్చి కాంపౌండ్‌ ప్రాంతానికి చెందిన ఫార్మాసిస్ట్‌ చల్లమల్ల రమేష్‌బాబు ఈ నెల 16వ తేదీ రాత్రి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రమేష్‌బాబు తల పైభాగం మూడు భాగాలుగా విడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. రమేష్‌బాబును స్థానికులు జమ్మిగడ్డలోని హెల్తీఫై ఆస్పత్రికి తరలించటంతో తలకు 70 కుట్లు వేసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో కోలుకున్న చల్లమల్ల రమేష్‌బాబును జిల్ల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి పెండెం వెంకటరమణ బుధవారం పరామర్శించి, అరుదైన చికిత్స చేసిన డాక్టర్ల బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ తాను చని పోతానని అందరూ భావించగా, వైద్యులు బతికించి పునర్జన్మ ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. హెల్తీఫై ఆస్పత్రి అధినేత మతకాల చలపతిరావు మాట్లాడుతూ రమేష్‌బాబు వైద్యానికి హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.2లక్షలు అయ్యేదని, ఈ చికిత్సను రూ.50వేలకే నిర్వహించి ప్రాణాలు కాపాడామని తెలిపారు.





Updated Date - 2022-01-20T07:11:08+05:30 IST