రుద్రంగిలో రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-06-12T05:38:50+05:30 IST
కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని వేగంగా తూకం వేయాలని డిమాండ్ చేస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు.
రుద్రంగి జూన్ 11: కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని వేగంగా తూకం వేయాలని డిమాండ్ చేస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రుద్రంగిలోని మార్కెట్ యార్డు, సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లో హమాలీ సంఘం రెండు గ్రూపులుగా తూకం వేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో కొనుగోల్లు పూర్తి కావడంతో అక్కడి గ్రూపు హమాలీలు ఖాళీగా ఉన్నారని, సింగిల్ విండో కొనుగోలు కేంద్రంల్లో ఉన్న ధాన్యాన్ని రెండు గ్రూపుల హమాలీలు తూకం వేస్తే తొందరగా కొనుగోళ్లు పూర్తి అవుతాయన్నారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న జడ్పీటీసీ గట్ల మీనయ్య, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొనుగోళ్లను వేగవంతంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు ఒద్యారపు రమేష్, గంధం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.