విజయవాడ: రెండో రోజు రేషన్ డీలర్ల ఆందోళన
ABN , First Publish Date - 2021-10-27T21:19:02+05:30 IST
రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజు కొనసాగుతోంది.
విజయవాడ: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజు కొనసాగుతోంది. గన్నీ బ్యాగుల అంశంతోపాటు పెండింగ్లో ఉన్న కమీషన్ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ హయాం నుంచే గన్నీ సంచులు డీలర్లకు ఇచ్చారని, అప్పటి నుంచి కమిషన్తో పాటు గన్నీ బ్యాగులు డీలర్లు అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పుడు బ్యాగుల కొరత పేరుతో ప్రభుత్వమే తీసుకుని ఒక్కో సంచికి 20 రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు. ఇప్పుడు అధికారులు గన్నీ బ్యాగులకు డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదంటున్నారని, దీని వల్ల డీలర్లు ఆర్ధికంగా మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే రేషన్ షాపులు ఎలా నడపాలి.., కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్నారు. దశాబ్దాల తరబడి ఎండీఎం, ఐసీడీఎస్ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.