రేషన్‌ బియ్యాన్ని.. దేశం దాటిస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-09-27T17:51:37+05:30 IST

జిల్లా నుంచి రేషన్‌ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన..

రేషన్‌ బియ్యాన్ని.. దేశం దాటిస్తున్నారు..!

అంతర్జాతీయ రాకెట్‌ గుట్టురట్టు

జిల్లా నుంచి విదేశాలకు మూడు పోర్టుల ద్వారా ఎగుమతి

వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది ట్రేడింగ్‌ కంపెనీల వ్యవహారం

మిల్లర్లు, దళారుల సహకారం 

162 ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

రూ. 1.10 కోట్ల విలువైన నిల్వలు సీజ్‌.. 31 మంది అరెస్టు 

వివరాలను వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

పూర్తిస్థాయి దర్యాప్తునకు ప్రత్యేక బృందం 


ఒంగోలు: జిల్లా నుంచి రేషన్‌ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రేడర్లు ఇక్కడ మిల్లర్లు, మధ్యవర్తుల ద్వారా ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సేకరించిన బియ్యాన్ని రైసు మిల్లులకు చేర్చి రీసైక్లింగ్‌ చేసి వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్‌ చేస్తున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, చెన్నై, మహారాష్ట్రలోని పన్వేలు (నవసేన పోర్టు)లకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ అంతర్జాతీయ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. రూ. 1.10 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 31 మందిని అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ వెల్లడించారు. 


బయటపడింది ఇలా.. 

జిల్లాలోని మార్టూరు మండలం వలపర్ల వద్ద ఉన్న విజయసాయికృష్ణ రైసు మిల్లు నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ తన సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు. బియ్యం లోడుతో ఉన్న లారీని సీజ్‌ చేశారు. అక్కడ ఉన్న రైసు మిల్లులో భారీ నిల్వలను గుర్తించారు. ప్రాథమిక విచారణలో జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తేలింది. దీంతో సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లోని పోలీసులు ఎక్కడికక్కడ రైసు మిల్లులపై దాడులు చేశారు. శనివారం కూడా అవి కొనసాగాయి. దీంతో అసలు గుట్టురట్టయ్యింది. సంతనూతలపాడులో రైసు మిల్లు నడుపుతున్న రాజేష్‌ ఈ వ్యవహారానికి ఇక్కడ ప్రధాన సూత్రధారి అని తేలింది. 


అక్కడ కంపెనీలు.. ఇక్కడ మిల్లర్లు, దళారులు 

దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఎనిమిది రిజిస్టర్‌ ట్రేడింగ్‌ కంపెనీలు రేషన్‌ మాఫియాను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వాటిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మూడు, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సఘడ్‌, మహారాష్ట్రల్లో ఒక్కో కంపెనీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు మన జిల్లాలో మిల్లర్లు, దళారుల ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు. 


రీసైక్లింగ్‌ ఆ తర్వాత బ్రాండెడ్‌గా ప్యాక్‌ చేసి ఎగుమతి 

చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే బియ్యాన్ని రేషన్‌ డీలర్‌ కిలో రూ. 10కి కొనుగోలు చేసి వాటిని రూ. 12 నుంచి రూ. 14 వరకూ వ్యా పారులకు అమ్ముతున్నారు. వారి వద్ద రైస్‌మిల్లర్లు రూ. 16కు కొనుగోలు చేసి రూ. 20  విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ఇక్కడ కొం దరు మిల్లర్లు, దళారుల ద్వారా ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేయిస్తున్నారు. వాటి ని వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్‌ చేయిస్తున్నారు.  అనంతరం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, చెన్నై, మహారాష్ట్రలోని పన్వేలు (నవసేన పోర్టు) ద్వారా ఆఫ్రికా, దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ బియ్యం జిల్లాలోని రైస్‌మిల్లుల నుంచి లారీల ద్వారా నేరుగా వేబిల్లులతో నే నౌకాశ్రయాలకు వెళ్తున్నాయి. అందుకోసం మిల్లర్లు, దళారులకు ఈ వ్యవహారం నడుపుతున్న ట్రేడింగ్‌ కంపెనీలు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నాయి. 


ఎంతటి వారైనా వదిలేదు లేదు

అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న రేషన్‌ బియ్యం రాకెట్‌ వెనుక ఎం తటి వారు ఉన్నా వదిలేదని లేదని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. జిల్లాలో రెండు రోజులుగా 162 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించిన 8,716 బ్యాగులు(4,35,800 కేజీల బియ్యం)ను సీజ్‌ చేశామన్నారు. వీటి విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 16 కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ అక్రమ రవాణాకు రాజేష్‌ అనే వ్యక్తి సూత్రధారి అని తెలిపారు. కేవలం పదో తరగతి చదువుకుని రైస్‌ మిల్లుల్లో పనిచేస్తూ మధ్యదళారీగా మారి రేషన్‌ బియ్యం రాకెట్‌ను నడిపిస్తున్నాడని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, మార్కాపురం ఓఎ్‌సడీ చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.  లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 


సీఐ, ఎస్‌ఐలకు రివార్డులు 

ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరచిన ఇంకొల్లు సీఐ అల్తా్‌ఫహుస్సేన్‌, మార్టూరు ఎస్‌ఐ ఎం.శివకుమార్‌, యద్దనపూడి ఎస్సై జి.వి.చౌదరి, హెడ్‌కానిస్టేబుల్‌ వసంతరావు, నరసింహారావు, కానిస్టేబుళ్లు డి.రాజేష్‌, హోంగార్డులు నాగూర్‌, ప్రభాకర్‌, వెంకయ్యలను అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం ఓఎ్‌సడీ కె.చౌడేశ్వరి, ఒం గోలు డీఎస్పీ ప్రసాద్‌, శిక్షణ డీఎస్పీ పి. స్రవంతిరాయ్‌, సీఐలు సూర్యనారాయణ,  రాంబాబు, సుబ్బారావు, ఆంజనేయరెడ్డి, మొయిన్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2020-09-27T17:51:37+05:30 IST