హేతుబద్ధీకరణను సమీక్షించాల్సిందే

ABN , First Publish Date - 2021-09-08T05:39:40+05:30 IST

విద్యాభ్యసన ఫలితాలు రాబట్టడానికి 60మంది విద్యార్థులకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయించాలని 2017లో పార్లమెంటులో చట్టం చేయడంతో పలు రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి...

హేతుబద్ధీకరణను సమీక్షించాల్సిందే

విద్యాభ్యసన ఫలితాలు రాబట్టడానికి 60మంది విద్యార్థులకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయించాలని 2017లో పార్లమెంటులో చట్టం చేయడంతో పలు రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న హేతుబద్ధీకరణ సహేతుకంగానే ఉన్నప్పటికీ– విద్యా హక్కు చట్టం ప్రకారం మెరుగైన ఫలితాల కొరకు ఉపాధ్యాయుల కొరత అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 12న ఉత్తర్వు నెం.25జారీ చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. 2021–22 విద్యా సంవత్సరం ప్రత్యక్ష బోధన ఇప్పుడిప్పుడే ప్రారంభమౌతున్నందున, మరోపక్క కరోనా పరిస్థితులు చక్కబడుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత రెండేళ్ళుగా కేవలం ఆన్‍లైన్ పాఠాలకే పరిమితం కావడంతో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు స్వల్పంగా ఉంది. కేవలం 'యూ–డైస్' (ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ) 2020–21ను ప్రాతిపదికగా విద్యార్థుల సంఖ్యను బట్టి హేతుబద్ధీకరణ చేపట్టడం వల్ల విద్యార్థుల ఉపాధ్యాయుల వాస్తవ నిష్పత్తికి సరితూగదు. కాగా ఉపాధ్యాయుల పోస్టులు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కరోనా పరిస్థితుల వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లను హేతుబద్ధీకరణ చేస్తే విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియపై సమాలోచన చేయాలి. నేటి కాలమాన పరిస్థితులకనుగుణంగా విద్యాహక్కు చట్టంలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని తగ్గించి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా సంస్కరణలు చేపట్టాలి. 

గుమ్మడి లక్ష్మీనారాయణ

Updated Date - 2021-09-08T05:39:40+05:30 IST