రాయలసీమ ఉద్యమకారుల సమావేశం
ABN , First Publish Date - 2021-06-14T05:35:23+05:30 IST
రాయలసీమ హక్కులైన నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడుదామని ఆర్వైపీఎస్, ఆర్వీపీఎస్, ఆర్వీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
కర్నూలు(అర్బన్), జూన్ 13: రాయలసీమ హక్కులైన నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడుదామని ఆర్వైపీఎస్, ఆర్వీపీఎస్, ఆర్వీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని క్రిష్ణా కాంత్ ప్లాజాలో ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ నాయుడు ఆధ్వర్యంలో రాయలసీమ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. నాయకులు రవికుమార్, సీమకృష్ణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన రాయలసీమ అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు. పెండింగ్ ప్రాక్టులు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. గుండ్రేవుల, వేదవతి, సిద్ధేశ్వరం సమాంతర కాలువ, పెట్నికోట రిజర్వాయర్, కుందూ నదిపై ప్రాజెక్టుల విషయంలో అతీగతి లేదని అన్నారు. కొన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమలో నూతన ప్రాజెక్టులు నిర్మించ లేదన్నారు. రాయలసీమలో 48 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమ నుంచి ఇచ్చినా ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయాల్లో ఉద్యోగాల వాటా 40 శాతం తేల్చాలని నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నియామకాలు జరపాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, గుంతకల్లుకు రైల్వేజోన్, ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సీమకు నీళ్లు, నిధులు, నియామకాలపై స్పందించకపోతే వైసీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయలసీమ నాయకులు, మద్దతుదారులు రామకృష్ణారెడ్డి, సుంకన్న, బత్తుల లక్ష్మీకాంతయ్య, బలరామ్, తూర్పాటి మనోహర్, రాజు, రత్నం, షేక్షావలి, సురేంద్రారెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.