మా విధానాలు ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావాన్ని తగ్గించాయి : ఆర్బీఐ గవర్నర్

ABN , First Publish Date - 2021-01-16T22:14:52+05:30 IST

ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో తమ

మా విధానాలు ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావాన్ని తగ్గించాయి : ఆర్బీఐ గవర్నర్

చెన్నై : ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో తమ విధానాలు దోహదపడ్డాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. 2020వ సంవత్సరం మానవాళికి అత్యంత కఠినమైన కాలాల్లో ఒకటి అని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మునుపెన్నడూ లేనంత విపత్తును సృష్టించిందన్నారు. శక్తికాంత దాస్ శనివారం 39వ నానీ పాల్కీవాలా స్మారకోపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


మానవ సమాజానికి గడచిన సంవత్సరం అత్యంత కఠినమైన పరీక్షా కాలాల్లో ఒకటి అని చెప్పవచ్చునని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక, సాంఘిక బలహీనతలు, లోపాలను ఈ మహమ్మారి బయటపెట్టిందన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా విపత్తు సంభవించడానికి కారణమైందన్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ కోసం మహమ్మారి సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా తెలివిగల, దూరాలోచనతో కూడిన వైఖరిని ప్రదర్శించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలకు మహమ్మారి సమయంలో సహకరించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక రంగంలో ఈ మహమ్మారి చూపే ప్రభావ తీవ్రత తగ్గడానికి ఆర్బీఐ విధానాలు దోహదపడినట్లు తెలిపారు. ఆర్థిక సుస్థిరతకు కట్టుబడుతూ, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆర్బీఐ దృఢ వైఖరితో ఉందని తెలిపారు. 


Updated Date - 2021-01-16T22:14:52+05:30 IST