ఈసారి రుణ పునర్ వ్యవస్థీకరణ?
ABN , First Publish Date - 2020-08-06T06:58:48+05:30 IST
పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం గురువారం మధ్యాహ్నం వెలువడనుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం ముగింపు సందర్భంగా వచ్చే రెండు నెలల కాలంలో అనుసరించదగిన...
- రెపో తగ్గింపు ఉండకపోవచ్చు
- నేడే ఆర్బీఐ పాలసీ
ముంబై: పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం గురువారం మధ్యాహ్నం వెలువడనుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం ముగింపు సందర్భంగా వచ్చే రెండు నెలల కాలంలో అనుసరించదగిన ద్రవ్యవిధానం ప్రకటిస్తారు. కనివిని ఎరుగని తిరోగమనంలో ఉన్న ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి రెపోరేటు మరోసారి తగ్గిస్తారా, ఈ నెలాఖరునాటికి ముగియనున్న రుణ వాయిదాల మారటోరియంపై ఆర్బీఐ ఏ వైఖరి అనుసరిస్తుంది అన్న విషయంలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. అదే సమయంలో తీవ్ర కష్టాల్లో ఉన్న కార్పొరేట్ కంపెనీల కోసం ఏకకాల రుణ పునర్ వ్యవస్థీకరణపై ఆర్బీఐ ప్రకటన వెలువరించవచ్చునన్నది పలువురి అభిప్రాయం.
వినియోగ వస్తువుల ద్రవ్యోల్బణం 6 శాతానికి పై స్థాయిలోనే ఉన్నందు వల్ల ఈ సారికి రెపోరేటు తగ్గింపు జోలికి వెళ్లకుండా రుణ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ఆర్బీఐ ఊరట కల్పించడవచ్చునని అధిక శాతం మంది అంటున్నారు. రుణ పునర్ వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం ఆర్బీఐ పరిశీలనలో ఉన్నదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఈ వాదం ప్రాధాన్యం సంతరించుకుంది. మారటోరియంను రిటైల్ కస్టమర్ల కన్నా కార్పొరేట్ సంస్థలే ఎక్కువగా ఉపయోగించుకున్నాయని, ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న కార్పొరేట్లు కూడా స్వప్రయోజన కాంక్షతో దాన్ని ఉపయోగించుకున్నందు వల్ల మారటోరియంను మరింతగా పొడిగించాల్సిన అవసరం లేదని కొందరి వారి సూచన.