మాయ... అబద్ధం... నిజం!

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

సృష్టి రహస్యానికి సంబంధించిన విషయాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం ఆరో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. మనసులో బాధ కమ్మేస్తున్నప్పుడు, గుండె కుదేలయినప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి...

మాయ... అబద్ధం... నిజం!

సృష్టి రహస్యానికి సంబంధించిన విషయాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం ఆరో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. మనసులో బాధ కమ్మేస్తున్నప్పుడు, గుండె కుదేలయినప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. ‘చదవమన్నాను కదా!’ అని వందసార్లు పారాయణం చేస్తే దుఃఖం పోతుంది అనుకుంటే పొరపాటు. నేనెప్పుడూ అలా చెప్పను. ఆ శ్లోకం భావాన్ని అర్థం చేసుకోవాలి. అవగాహన చేసుకోవాలి. దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడు ఆచరణలో పెట్టాలి. 


  • అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్‌!
  • ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా!!

విద్యార్థులు, సంసార జీవితాల్లో ఉన్న వారూ... అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ‘‘అర్జునా! నాకు జన్మలేదు. ఆత్మకు నాశనం లేదు. ఈ జీవులన్నింటికీ నేను అధిపతిని. అయినప్పటికీ నా ప్రకృతికి నేనే అధిష్ఠానంగా ఉండి, నాకు నేనే సృష్టించుకున్న ఒక మాయ వల్ల పుడుతున్నాను’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. ఒక వ్యక్తి పడుకున్నాడు. నిద్రలో కల గన్నాడు. కలలో ఉన్న వ్యక్తి ఎవరు? తీవ్రంగా ఆలోచించండి. ఆ కలలో ఎన్నో రూపాలు కనిపించాయి. అదంతా ఏమిటీ? అంటే ఆత్మ మాయ! ఆ మాయే మనస్సు. కలలో వచ్చిన మనషులు, కలలో వచ్చిన జంతువులు, కలలో వచ్చిన చెట్లు.. ఇవన్నీ ఎవరి సృష్టి? మన మాయ ద్వారా మనమే వాటిని పుట్టించాం! దేవుడు ప్రత్యేకంగా ఎక్కడా లేడు. నువ్వుగా, నేనుగా ఉన్నాడు. సమష్టిగా ఉంటే ప్రకృతి, ఒంటరిగా ఉంటే మనస్సు. అంటే జీవుడికి మనస్సు ఉంది. ఒక జీవుడు పడుకొని తన ఆత్మ మాయ వల్ల, తన మనస్సుని అందులో ఉండే వాంఛలనూ, కోరికలనూ ఆధారంగా చేసుకొని కలలో మళ్ళీ పుడుతున్నాడు. మంచం మీద శరీరం ఉండగా, ఆ లోపల శరీరం ఎవరిది? ఆ శరీరాన్ని ధరించకపోతే ఎందుకు అనుభూతి చెందుతున్నావు? ఎందుకు కేకలు వేస్తున్నావు? ఈ విషయం ఆలోచించండి. సృష్టి మాయ! కల ఎప్పుడూ అబద్ధం. శరీరం నిజం!

- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST