చదును చేయ్.. అమ్మేయ్!
ABN , First Publish Date - 2020-08-03T10:19:53+05:30 IST
స్తంభాద్రి అర్బన్ డెవల్పమెంట్ అధారిటీ (సుడా) వచ్చినా రియల్ ఎస్టేట్ యజమానులు పట్టించుకోవటం లేదు.
నిబంధనలు జాన్తానై విచ్చలవిడిగా రియల్వెంచర్లు
‘సుడా’ను పట్టించుకోని వ్యాపారులు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులోనూ నిర్లక్ష్యం
అధికార అండదండలుండటంతో ఏమీ చేయలేకపోతున్న అధికారులు
నిలువునా మోసపోతున్న కొనుగోలుదారులు
ఖమ్మం కార్పొరేషన్, ఆగస్ట్ 2: స్తంభాద్రి అర్బన్ డెవల్పమెంట్ అధారిటీ (సుడా) వచ్చినా రియల్ ఎస్టేట్ యజమానులు పట్టించుకోవటం లేదు. లే-అవుట్ల అనుమతి తీసుకున్న అనంతరమే ప్లాట్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నా రియల్ వెంచర్లు వేస్తూ వాటిని అమ్ముకుంటున్నా రు. తద్వారా అమాయక ప్రజలు మోసపోతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా స్థలాలను చదును చేయటం, వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. రియల్ వ్యాపారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వెంచర్లు వేస్తున్నా అధికారులు మాత్రం సమీక్షలు, సమావేశాలతోనే కాలం గడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలతో సుడా ఛైర్మన్, సీపీవో, ఇతర అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ అక్రమ వెంచర్లు వేసే వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా.
వాటిని పట్టించుకోవటం లేదు. దీంతో రియల్ యజమానులు విచ్చలవిడిగా వెంచర్లు వేస్తున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, ఇతర బడా వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఏం చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్థలం కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్న తరుణంలో రియల్ వ్యాపారుల పంట పండుతోంది. ఎకరాల స్థలాల్లో ప్లాట్లు ఏర్పాటు చేయగానే అవి అ మ్ముడుపోతున్నాయి.
ఎల్ఆర్ఎ్సకు అవకాశం ఉన్నా..
2018, మార్చి 30వ తేదీ లోపు వెంచర్లను రిజిస్త్రేషన్ చేయించుకున్న వారికి ప్రభుత్వం క్రమబద్ధీకరణకు (ఎల్ఆర్ఎస్) అవకాశం ఇచ్చింది. సుడా పరిధిలో అటువంటి వెంచర్లు సుమారు ఎనిమిది వందల వరకు ఉండవచ్చని అంచనా. ఈ వెంచర్లలో పదుల సంఖ్యలో ప్లాట్లు ఉం టాయి. కాగా ప్లాట్ల ప్రకారం ఎల్ఆర్ఎ్సకు అవకాశం ఉండటంతో ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ కోసం రెండు వేల వరకు శరఖాస్తులు వచ్చాయి. కాగా కొందరు రియల్వెంచర్ల యజమానులు ఎల్ఆర్ఎ్సకు దరఖాస్తు చేసే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు, ఎప్పుడో విక్రయించిన ప్లాట్లను పట్టించుకొనేది ఏమిటనే ధోరణి వారిలో కన్పిస్తోంది.
ఎడాపెడా అక్రమ వెంచర్లు
ఎల్ఆర్ఎ్సకు అవకాశం లేని వెంచర్లు కొన్ని ఉన్నాయి. అంటే 2018 మార్చి తరువాత రిజిస్త్రేషన్లు చేసిన వెంచర్లు ఉన్నాయి. ఇవీ కాకుండా సుడా ఏర్పడిన తరువాత కూడా తాజాగా సుమారు 20 వెంచర్లు వేయటం గమనార్హం. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వెంచర్ కోసం చెరువును పూడ్చి మరీ స్థలాన్ని చదును చేశారంటే రియల్వ్యాపారుల బరితెగింపు ను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కొత్తగా సుడాకు చైర్మన్ను, సలహాసంఘ సభ్యులను నియమించింది. అయితే అధికారులను నియమించకపోవటతో అక్ర మ వెంచర్లు తామ రతంపరగా వెలుస్తున్నాయి. దీంతో వీటిని అరికట్ట్టలేకపో తున్నారు.
ఇదే అదునుగా బడాబాబులు, రాజకీయ ప్రాబ ల్యం కలిగిన నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు ఏర్పాటు చేసి సొమ్ములు చేసుకుంటున్నారు. మొదట వినియోగదారులను మాయ మాటలతో మభ్యపెడుతున్న వ్యాపారులు ప్లాట్లు విక్రయించిన తర్వాత ముఖం కూడా చూడటం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా నిలదీస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని సమాచారం.