మామిడి మజా!
ABN , First Publish Date - 2020-05-23T05:30:00+05:30 IST
రోజూ మామిడి పండ్లు తింటూనే ఉంటారు. మ్యాంగో జ్యూస్ తాగుతూనే ఉంటారు. అలా కాకుండా మామిడి పండ్లతో ఛీజ్ కేక్, ఐస్క్రీమ్, రైతా, పనీర్ రోల్స్... ఇలా కాస్త వెరైటీగా రెసిపీలు తయారు చేసుకుని టేస్ట్ చేస్తే ఆ మజాయే...
రోజూ మామిడి పండ్లు తింటూనే ఉంటారు. మ్యాంగో జ్యూస్ తాగుతూనే ఉంటారు. అలా కాకుండా మామిడి పండ్లతో ఛీజ్ కేక్, ఐస్క్రీమ్, రైతా, పనీర్ రోల్స్... ఇలా కాస్త వెరైటీగా రెసిపీలు తయారు చేసుకుని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు. మరి మీరూ ట్రై చేయండి.
ఛీజ్ కేక్
కావలసినవి: బిస్కెట్లు - 125 గ్రాములు, వెన్న - 60 గ్రాములు, పనీర్ - 50 గ్రాములు, మామిడిపండు గుజ్జు - రెండు కప్పులు, పంచదార - ఒకకప్పు, జున్ను - రెండు కప్పులు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక స్పూన్.
తయారీ: బిస్కెట్లను పొడిగా చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
- వెన్నను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, బిస్కెట్ల పొడిలో వేసి కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని కొద్దిగా మందపాటి, వెడల్పాటి పాత్రలో సమంగా వేసి కొద్దిగా ఒత్తాలి. (కేక్ తయారుచేసే పాత్ర తీసుకోవాలి)
- తరువాత ఫ్రిజ్లో పెట్టాలి.
- మిక్సీలో పనీర్, జున్ను వేసి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి కలుపుకోవాలి.
- తరువాత అందులో మామిడిపండు గుజ్జు వేసి కలియబెట్టుకోవాలి.
- ఈ మామిడిపండు మిశ్రమాన్ని బిస్కెట్ పొడి మిశ్రమంపై పోసి మళ్లీ ఫ్రిజ్లో పెట్టాలి.
- ఇప్పుడు మరొకపాత్రలో కొద్దిగా మామిడిపండు గుజ్జు, పంచదార, నీళ్లు తీసుకుని స్టవ్పై మరిగించాలి.
- ఈ మిశ్రమాన్ని పైన ఒక లేయర్గా పోయాలి. అంతే... ఎంతో రుచికరమైన మ్యాంగో ఛీజ్ కేక్ రెడీ.
మ్యాంగో ఐస్క్రీమ్
కావలసినవి: పాలు - ఒకకప్పు, క్రీమ్ - మూడు కప్పులు, మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, మామిడిపండు ముక్కలు - ఒక కప్పు, కస్టర్డ్ పౌడర్ - ఒక టేబుల్స్పూన్, వెనీలా - ఒక టేబుల్స్పూన్, పంచదార - ఒక కప్పు.
తయారీ: ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకొని, అందులో కస్టర్డ్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- మిగిలిన పాలను మరొక పాత్రలో తీసుకొని పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగి, పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్ మిశ్రమం వేసి కలుపుకోవాలి.
- కాసేపు మరిగిన తరువాత స్టవ్పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి. తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్, వెనీలా వేసి కలుపుకోవాలి.
- మూత గట్టిగా ఉండే పాత్రలోకి మిశ్రమాన్ని మార్చుకుని ఫ్రిజ్లో పెట్టాలి.
- కాసేపయ్యాక ఫ్రిజ్లో నుంచి తీసి బాగా కలియబెట్టి మళ్లీ ఫ్రిజ్లో పెట్టి మ్యాంగో ఐస్క్రీమ్ సర్వ్ చేయాలి.
రైతా
కావలసినవి: మామిడిపండ్లు - రెండు, పెరుగు - రెండు కప్పులు, పంచదార - రెండు స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్స్పూన్, ఆవాలు - ఒక టీస్పూన్, ఎండుమిర్చి - రెండు, మెంతులు - పావు టీస్పూన్,
తయారీ: మామిడిపండ్లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక పాత్రలో పెరుగు, పంచదార తీసుకోవాలి. పంచదార కరిగే వరకు స్పూన్తో కలియబెట్టాలి.
- ఇప్పుడు అందులో మామిడిపండు ముక్కలు వేసి కలుపుకోవాలి.
- మరొక పాత్ర తీసుకొని స్టవ్పై పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి.
- ఎండుమిర్చి, మెంతులు వేసి మరికాసేపు వేగించాలి.
- ఈ పోపు మిశ్రమాన్ని మామిడిపండు రైతాపై పోసి కలుపుకోవాలి.
- కొన్ని మామిడి ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
- ఫిజ్లో పెట్టుకుని కూల్ మ్యాంగో రైతాను సర్వ్ చేసుకోవాలి.
మ్యాంగో పనీర్ రోల్స్
కావలసినవి
మామిడిపండు - ఒకటి, పనీర్ - అర కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, సిల్వర్ ఫాయిల్, రోజ్ పెటల్స్ - గార్నిష్ కోసం.
తయారీ
- ముందుగా ఒక పాత్రలో పనీర్ను పొడిగా చేయాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
- మామిడిపండు తొక్క తీసి కొద్దిగా సన్నని, వెడల్పాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక ప్లేట్లో ఆ ముక్కలు పెట్టి, ప్రతీ ముక్కపై కొద్దిగా పనీర్ మిశ్రమాన్ని పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి.
- చివరగా సిల్వర్ ఫాయిల్, రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకోవాలి.
- ఫ్రిజ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక సర్వ్ చేసుకోవాలి.
క్రంబ్ బార్స్
కావలసినవి
మామిడిపండ్లు - మూడు, పంచదార - ఐదు టేబుల్స్పూన్లు, మొక్కజొన్న పిండి - అర టేబుల్స్పూన్లు, పిండి - రెండు కప్పులు, బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్, ఉప్పు - పావు టీస్పూన్, వెన్న - ముప్పావు కప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - అర టీస్పూన్.
తయారీ
- ముందుగా ఓవెన్ను 350 డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రతకు వేడి చేయాలి.
- మామిడిపండును ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.
- తరువాత అందులో మొక్కజొన్నపిండి, పంచదార వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- మరొక పాత్రలో పిండి, బేకింగ్పౌడర్, తగినంత ఉప్పు తీసుకోవాలి.
- వెన్నను ముక్కలుగా కట్ చేసి పిండిలో వేసి కలపాలి.
- ఇప్పుడు కోడిగుడ్డు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేయాలి. బాగా కలియబెట్టాలి. మిశ్రమం పొడిపొడిగా తయారవుతుంది.
- ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాన్పై ఒక లేయర్లా వేసుకోవాలి.
- దానిపై మామిడిపండు మిశ్రమాన్ని అంతటా సమంగా పడేలా పోయాలి.
- పైన కొద్దిగా పొడి పిండి మిశ్రమాన్ని చల్లాలి.
- ఓవెన్లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి.
- తరువాత ఓవెన్లో నుంచి తీయాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.