ఏడీఏ కుర్చీ కోసం పైరవీలు
ABN , First Publish Date - 2021-10-06T05:47:50+05:30 IST
కర్నూలు డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ కుర్చీ కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు వ్యవసాయశాఖ అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 5: కర్నూలు డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ కుర్చీ కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు వ్యవసాయశాఖ అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక అధికారి ఎమ్మెల్యే సిఫారసుతో ఈ కుర్చీని దక్కించుకుంటే.. మరో అధికారి మంత్రి సిఫారసుతో నాలుగు రోజులకే ప్రభుత్వం నుంచి అనుమతి పొంది బాధ్యతలు స్వీకరించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సిఫారసుతో వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో ఆల్తాఫ్ ఆలీ అహ్మద్ కర్నూలు ఏడీఏగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. ఆల్తాఫ్ ఆలీ అహ్మద్ రెండు రోజుల్లో ఈ కుర్చీని వదలక తప్పదని ఆ శాఖలో ప్రచారం అయింది. అలాగే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిఫారసుతో ఆత్మకూరు ఏడీఏగా పని చేస్తున్న శాలురెడ్డికి కర్నూలు ఇన్చార్జి ఏడీఏగా బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఏడీఏ ఆల్తాఫ్ ఆలీ అహ్మద్ మళ్లీ ఎమ్మెల్యేకు, రాష్ట్ర ఉన్నతాధికారులకు తన ఇబ్బందులను చెప్పుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలు జిల్లా వ్యవసాయశాఖ వర్గాలను విస్మయానికి లోను చేశాయి.