నత్తనడకన ఈఎస్ఐ ఆస్పత్రి పునర్నిర్మాణం
ABN , First Publish Date - 2021-01-16T04:57:36+05:30 IST
ఉత్తరాంధ్రలోని లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న ఈఎస్ఐ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆస్పత్రి పునర్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
2018లో పనులు ప్రారంభం
2021 ఏప్రిల్కు పూర్తి కావాలని లక్ష్యం
సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించని వైనం
అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణం
మల్కాపురం, జనవరి 15 : ఉత్తరాంధ్రలోని లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న ఈఎస్ఐ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆస్పత్రి పునర్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్కాపురంలోని ఈఎస్ఐ ఆస్పత్రి పునర్నిర్మాణ పనులను 2018లో ప్రారంభించారు. 2021 ఏప్రిల్లోగా పనులు పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితిని చూస్తే సకాలంలో పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మల్కాపురంలో ఈ ఆస్పత్రిని 1972లో నిర్మించారు. అప్పటి నుంచి లక్షలాది మంది కార్మికులకు వైద్య సేవలందించింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వివిధ ప్రైవేటు కంపెనీల కార్మికులు ఇక్కడే వైద్య సేవలు పొందేవారు. అయితే ఈ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇందులోని విభాగాలను 2017 నవంబరు నెలలో ఆరిలోవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రిలోని విభాగాలను అక్కడికి తరలించడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోనే వేలాది మంది ఈఎస్ఐ కార్డుదారులు ఉన్నారు. వీరంతా ఆరిలోవలోని ఆస్పత్రికి వెళ్లడం దూరాభారంగా ఉంది.
రూ.20 కోట్లతో ఆస్పత్రి పునర్నిర్మాణం
మల్కాపురంలోని ఈఎస్ఐ ఆస్పత్రి పునర్నిర్మాణ పనులను రూ.20 కోట్లతో తిరుపతికి చెందిన సీఎస్ఆర్ ఇన్ఫోటెక్ అనే సంస్థ చేపడుతోంది. గతంలో 125 పడకలు ఉండగా, ఇప్పుడు 200 పడకలతో ఆస్పత్రి నిర్మిస్తున్నారు. 10 ఎకరాలలో ఉన్న ఈ ఆస్పత్రి ముందుభాగం అంతా అలాగే ఉంచి ప్లాస్టింగ్లు చేస్తున్నారు. శ్లాబ్ను కూడా అలాగే ఉంచి పూర్తిగా ప్లాస్టింగ్ చేశారు. అయితే డాక్టర్ల గదులు, ఓపీలు, ఇతర విభాగాలను కొత్తగా నిర్మిస్తున్నారు. ఇన్పేషంట్ గదులను కూడా పూర్తిగా నేలమట్టం చేసి తిరిగి కొత్తగా నిర్మిస్తున్నారు. కాగా ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నెమ్మదిగా కొనసాగుతున్నాయి. సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణ పనులైతే ఇప్పటికీ ప్రారంభంకాలేదు. ఈ ఏడాది ఏప్రిల్లోగా ఆస్పత్రి పనులు పూర్తవుతాయనేది సందేహమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఈఎస్ఐ కార్డుదారులు కోరుతున్నారు.