కేవలం 100 రోజులు మాస్క్‌లు ధరించమని కోరతా: జో బైడెన్

ABN , First Publish Date - 2020-12-05T09:06:10+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. థ్యాంక్స్ గివింగ్ డే కారణంగా అమెరికా వ్యాప్తంగా మహమ్మారి విజృంభించింది.

కేవలం 100 రోజులు మాస్క్‌లు ధరించమని కోరతా: జో బైడెన్

వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. థ్యాంక్స్ గివింగ్ డే కారణంగా అమెరికా వ్యాప్తంగా మహమ్మారి విజృంభించింది. గురువారం అమెరికాలో 2,13,830 కరోనా కేసులు నమోదవగా.. 2,861 మంది ప్రాణాలు కోల్పోయరు. దీంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటూ నేతలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క కేసులు ఈ విధంగా పెరుగుతున్నా ట్రంప్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలూ వస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏ విషయంలోనూ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 


ఇదిలా ఉంటే.. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన జో బైడెన్ ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చే ప్రణాళికలను రచిస్తున్నారు. ‘నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 100 రోజులు మాత్రం మాస్క్ ధరించమని ప్రజలను కోరుతాను. జీవితాంతం అవసరం లేదు.. కేవలం వంద రోజులు మాత్రమే. నేను అనుకున్నది విజయవంతమైతే కేసుల్లో గణనీయమైన తగ్గుదలను చూస్తారని అనుకుంటున్నాను. వ్యాక్సిన్, మాస్క్‌లతో కేసుల సంఖ్యను తగ్గించవచ్చు’ అని జో బైడెన్ గురువారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 1,47,18,341 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 2,85,150 మంది మృత్యువాతపడ్డారు.   

Updated Date - 2020-12-05T09:06:10+05:30 IST