రీ కౌంటింగ్‌ చేసినా రెండోసారీ TDP అభ్యర్థే గెలుపు..

ABN , First Publish Date - 2021-11-17T18:05:53+05:30 IST

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కౌంటింగ్...

రీ కౌంటింగ్‌ చేసినా రెండోసారీ TDP అభ్యర్థే గెలుపు..

చిత్తూరు జిల్లా : కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ ఇప్పటి వరకూ పలు ఘటనలు వెలుగుచూడగా తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. 11వ వార్డులో కేవలం 06 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. అయితే మళ్లీ రీ కౌంటింగ్ జరపాల్సిందేనని.. ఈసారీ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ జరిపించారు. అయితే ఈ రీ కౌంటింగ్‌లో కూడా టీడీపీ అభ్యర్థి కస్తూరి గెలుపొందారు. ఇలా వైసీపీ రెండోసారికి పట్టుబట్టి మరీ పరువు తీసుకోగా.. టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


కాగా.. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే వైసీపీనే ఎక్కువ స్థానాల్లో గెలిచి నిలిచింది. టీడీపీ మాత్రం ఊహించని రీతిలో సీట్లకు పరిమితం కావడం గమనార్హం. తొలి రౌండ్ వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. 1,2,3,4,7,8,9,10,15 వార్డుల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మరోవైపు.. 05వ వార్డు, 11 వార్డులో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.


తాజాగా ఆరో వార్డు నుంచి కూడా టీడీపీ అభ్యర్థే గెలుపొందారు. అయితే ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలుపొందడం.. మరోవైపు లీడింగ్‌లోనూ అదే పార్టీ ఉండటంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండగా.. పూర్తి ఫలితాలు రావడానికి మధ్యాహ్నం 03 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని తెలియవచ్చింది. కాగా.. ఇప్పటికే ఈ కుప్పం నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఎక్కువ స్థానాలను టీడీపీ కోల్పోయింది.

Updated Date - 2021-11-17T18:05:53+05:30 IST