రెడ్ అంబులెన్స్ దౌర్జన్యాన్ని అరికట్టాలి
ABN , First Publish Date - 2021-01-21T07:12:46+05:30 IST
అంబులెన్స్ యజమానులు, డైవ్రర్ల జీవితాలతో ఆడుకుంటున్న రెడ్ అంబులెన్స్ దౌర్జన్యాన్ని అరికట్టాలని గ్రేటర్ హైదరాబాద్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
పంజాగుట్ట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అంబులెన్స్ యజమానులు, డైవ్రర్ల జీవితాలతో ఆడుకుంటున్న రెడ్ అంబులెన్స్ దౌర్జన్యాన్ని అరికట్టాలని గ్రేటర్ హైదరాబాద్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం ఎర్రమంజిల్ కాలనీలో అంబులెన్స్ డైవ్రర్లు, యజమానులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంకర్రెడ్డి, నాయకులు సురేష్, నాగన్న మాట్లాడుతూ.. రోగులకు సేవలు అందిస్తామని నగరంలోకి ప్రవేశించిన రెడ్ అంబులెన్స్ సంస్థ ప్రస్తుతం వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. అంబులెన్స్ యజమానుల వద్ద కమీషన్ వసూలు చేస్తోందన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్న సదరు సంస్థ రోగులకు పరిచయం ఉన్న అంబులెన్స్ను సైతం లోపలికి అనుమతించడం లేదన్నారు. గ్రేటర్ అంబులెన్స్ సర్వీసులపై ఆధారపడి జీవిస్తున్న సుమారు వెయ్యి కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు. రెడ్ అంబులెన్స్ సంస్థ ఆగడాలను అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.