ఒక్క కాయా రాలేదు...!

ABN , First Publish Date - 2022-01-25T04:41:57+05:30 IST

వ్యవసాయ సీజన్‌ చరిత్రలో ఇంతటి దారుణాతిదారుణమైన ఏడాది ఇంటే ఇదే. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వెంటాడి పైర్లు దెబ్బతిన్నప్పటికీ ఎంతోకొంత దిగుబడి వచ్చేది. పెట్టిన పెట్టుబడికి కొంచెం అటూఇటూగా అసలు రావడమో, స్వల్ప నష్టమో వచ్చేది. కానీ ఈ ఏడాది పెట్టిన పెట్టుబడికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా చేతికి అందని దుస్థితి.

ఒక్క కాయా రాలేదు...!
తెగులుతో పూత, పిందె, కాయల్లేని కందిచేను

వెర్రి తెగులు, గొడ్డాకుతో కాపులేని కంది 

వేల ఎకరాల్లో నష్టం

దున్ని వేస్తున్న కొందరు రైతులు 

కంప కోసి ప్రహరీ తడికెలకు ఇంటికి తెచ్చుకుంటున్న ఇంకొందరు

ఇపుడు వేరే పంట వేయలేని స్థితి 

వదిలేసిన రైతులు 

కొండపి, జనవరి 24 : వ్యవసాయ సీజన్‌ చరిత్రలో ఇంతటి దారుణాతిదారుణమైన ఏడాది ఇంటే ఇదే. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వెంటాడి పైర్లు దెబ్బతిన్నప్పటికీ ఎంతోకొంత దిగుబడి వచ్చేది. పెట్టిన పెట్టుబడికి కొంచెం అటూఇటూగా అసలు రావడమో, స్వల్ప నష్టమో వచ్చేది. కానీ ఈ ఏడాది పెట్టిన పెట్టుబడికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా చేతికి అందని దుస్థితి. ఈ ఏడాది అధిక వర్షాలతో వెర్రి తెగులు, గొడ్డాకు ఏర్పడటంతో కంది పైరు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వందలాది ఎకరాల్లో పైరును నిలువునా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇపుడు కంది తీసేసినా కొత్తగా ఏ పైరు వేయలేని సంకట స్థితి. దీంతో కంది రైతులు రోజూ కొంత కంది కంపను కోసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఇళ్ల వద్ద ప్రహరీలకు, తడికెలకు కంపను కట్టుకునేందుకు కంప తెచ్చుకుంటున్నారు. కొంతమంది రైతులు రోటావేటర్‌తో దున్నివేస్తున్నారు. 

మండలంలో దాదాపు 5వేల ఎకరాల్లో కందిని రైతులు సాగు చేశారు. అన్నీ బాగుంటే మరో ఇరవై రోజుల్లో పంట చేతికొచ్చేది.  ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, పలు తెగుళ్ల దాడితో ఆకు విపరీతంగా పెరిగి గొడ్డాకు ఏర్పడింది. పూత, పిందె, కాయలేకుండా పోయింది. ప్రధానంగా పెట్లూరు గ్రామ పంచాయతీలోని కోయవారిపాలెంలో దాదాపు 300 ఎకరాల్లో కంది పంట పరిస్థితి ఇది. అలాగే చినకండ్లగుంట గ్రామ పంచాయతీలోని పోలిరెడ్డిపాలెంలో దాదాపు 350 ఎకరాల్లో కంది వేశారు. పైరులో ఒక్క కాయ కూడా కాయని దుస్థితి. దీంతో కొందరు రైతులు రొటావేటర్‌తో దున్నివేయగా, ఇంకొందరు రోజూ కొంత కంది కంప కోసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితి ఎప్పుడూ లేదని గ్రామానికి చెందిన కంది సాగు చేసిన రైతులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఇంత దారుణంగా కాయలు కాయకపోవడం ఈ ఏడాదేనని చెబుతున్నారు. ఇప్పటికే సాగు కోసం ఎకరాకు 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని చెప్పారు. డిసెంబరు ఆఖరి నుంచి ఈ తెగులు వ్యాపించి ఒక్కసారిగా పూత, పిందె, కాయలు లేకుండా పోయాయని వాపోతున్నారు. అఖరి దశలో ఇలాజరగడంతో పెట్టుబడి 20 వేల రూపాయలు బూడిదలో పోసిన చందంగా తయారైందని రైతులు వాపోతున్నారు. కేజీ  కండ్రిగ, కొండపి, కట్టావారిపాలెం, ఇలవర (నేతివారిపాలెం) తదితర గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నష్ట పరిహారం ఇప్పించాలని సాగు చేసిన రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-25T04:41:57+05:30 IST