నాసిరకం మిర్చి నారు కొని మునిగిపోయాం
ABN , First Publish Date - 2021-01-21T06:01:32+05:30 IST
మండలంలో బూదవాడ, రెడ్డినాయక్ తండా గ్రామాలకు చెందిన 25 మంది రైతులు నాసిరకం మిర్చి నారు కొని నిండా మునిగి పోయామని జగ్గయ్యపేట తహసీల్దార్కు, వ్యవసాయశాఖ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు.
బూదవాడ, ఆర్.ఎన్ తండా రైతుల గగ్గోలు
జగ్గయ్యపేట, జనవరి 20: మండలంలో బూదవాడ, రెడ్డినాయక్ తండా గ్రామాలకు చెందిన 25 మంది రైతులు నాసిరకం మిర్చి నారు కొని నిండా మునిగి పోయామని జగ్గయ్యపేట తహసీల్దార్కు, వ్యవసాయశాఖ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఐదు నెలల క్రితం చిల్లకల్లులో ఒక నర్సరీలో మిర్చి నారును కొనుగోలు చేసి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికి కాయ రాలేదని, ఒకటి అరా వచ్చినా తాలు కాయ వచ్చిందని వాపోయారు. బుధవారం తహసీల్దార్ రామకృష్ణకు, ఏవో లక్ష్మీరెడ్డికి రైతులు ఫిర్యాదు చేశారు. ఎకరానికి ఇప్పటికి రూ.70వేలు వరకు ఖర్చు పెట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదని అన్నారు. మిర్చి పైర్లను పరిశీలిస్తామని వ్యవసాయాధికారులు హామీ ఇచ్చారు.