లాక్డౌన్తో ప్రధాన నగరాల్లో తగ్గిన వాయుకాలుష్యం
ABN , First Publish Date - 2021-06-17T17:39:11+05:30 IST
కరోనా లాక్ డౌన్ ఆంక్షలు ప్రజలకు ఇబ్బందులు తెస్తే.. పర్యావరణానికి మాత్రం ఎంతో మేలు చేసింది.
హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ ఆంక్షలు ప్రజలకు ఇబ్బందులు తెస్తే.. పర్యావరణానికి మాత్రం ఎంతో మేలు చేసింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, రవాణ నిలిచిపోవడం, పరిశ్రమలు మూతపడడం వంటి కారణాలతో గాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. కాలుష్య కోరల్లో ఉన్న నగరాలు కాస్తా ఊపిరి పీల్చుకున్నాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ విధించడంతో పేదలు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని పోషించుకోలేక పస్తులు ఉన్న పరిస్థితులు చూశాం. మాయదారి కరోనా త్వరగా పోవాలని పూజలు, హోమాలు చేశారు. అంతలా భయపెట్టిన కరోనా పర్యావరణానికి మాత్రం మేలు చేసిందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. కాలుష్యకోరల్లో చిక్కుకుని ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలు ఇప్పుడు స్వచ్ఛమైన నగరాలుగా మారిపోయాయి. ఏప్రిల్ నుంచి కొనసాగుతున్న కర్ఫ్యూ కారణంగా గాలిలో స్వచ్ఛత పెరుగుతోంది. జనవరి నుంచి మే వరకు కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్, మేలో గాలిలో స్వచ్ఛత బాగా పెరిగిందంటున్నారు.