వలస కార్మికుల పేర్ల నమోదు

ABN , First Publish Date - 2020-05-08T07:31:01+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు జిల్లాలోనే ఉండిపోగా వీరిందరినీ స్వరాష్ట్రాలకు తరలించేందుకు

వలస కార్మికుల పేర్ల నమోదు

పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్ల నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు

1,388 మంది కార్మికుల వివరాలు నమోదు


కరీంనగర్‌ క్రైం, మే 7: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు జిల్లాలోనే ఉండిపోగా వీరిందరినీ స్వరాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా వలస కార్మికుల నమోదు కార్యక్రమం మొదలైంది. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు పోలీసులు 1,388 మంది వలస కార్మికుల వివరాలను అప్‌లోడ్‌చేశారు. అనంతరం వీరందరికీ ద్రువీకరణ పత్రం అందజేశారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని మూడు ప్రాంతాల ఫంక్షన్‌ హాల్‌లలో వలస కార్మికుల నమోదు చేపట్టారు.


ఒడిస్సా, బీహార్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు జిల్లాలోని గ్రానైట్‌, భవననిర్మాణ, హోటల్‌, రైస్‌మిల్లు, పత్తి మిల్లు, ఇతర పరిశ్రమల్లో భారీ ఎత్తున పనిచేస్తున్నారు. వీరందరూ స్వంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్థంగా ఉండటంతో పోలీసులు వీరి వివరాలు నమోదు చేస్తున్నారు. వలస కార్మికులు ఆధార్‌కార్డుతో పాటు నమోదు కేంద్రంలో హాజరైతే వారి వివరాలతోపాటు వారి ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.


ఇలా అప్‌లోడ్‌ చేసిన వలస కార్మికులు ఒక రాష్ట్రానికి చెందిన 1200 మందికి ఒక రైలు కేటాయించి ఆ రైలు బయలు దేరు సమయం, స్టేషన్లను వలస కార్మికుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపిస్తారు. వలస కార్మికులకు కేటాయించిన రైల్వేస్టేషన్‌, తేదీలలో వారు హాజరు కావాలి. వీరికి పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్‌లలో రైలు ఎక్కేందుకు అనుమతించారు. రైల్వేస్టేషన్‌ వరకు వీరిని బస్సులలో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-08T07:31:01+05:30 IST