మత విషయాలు పాఠ్యాంశాలుగా తగవు
ABN , First Publish Date - 2021-09-16T06:03:53+05:30 IST
మనది లౌకిక దేశం అన్న విషయం ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మరచినట్లుంది. ప్రభుత్వం మతపరమైన అంశాలను ప్రచారం చేయకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు....
మనది లౌకిక దేశం అన్న విషయం ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మరచినట్లుంది. ప్రభుత్వం మతపరమైన అంశాలను ప్రచారం చేయకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు. ప్రాథమిక విద్య నుంచి పిల్లలకు చరిత్రను తెలియచెయ్యాలే తప్ప పుక్కిటి పురాణాలను, విద్యార్థులకు భోదించరాదు. ఈ ఏడాది ఐదవ తరగతిలో గుణదల మేరీమాత అంశాన్ని, ఆరవ తరగతిలో విజయవాడ కనకదుర్గ అంశాన్ని పాఠ్యాంశంలో చేర్చారు. చిన్నపిల్లల మనసులు గుళ్లు, చర్చిల వైపు, కులాల వైపు మరల్చకూడదు. శాస్త్రీయమైన విషయాల గురించి, చరిత్రకు సంబంధించి, సామాజిక విషయాలపై వారి దృష్టి కేంద్రీకరించే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి. అప్పుడే శాస్త్రీయ దృక్పథం వారికి అలవడుతుంది. ప్రాథమిక విద్య నుంచి విద్యార్థులకు శాస్త్రీయవిద్యను అందిస్తే సమాజం శాస్త్రీయ సమాజంగా మారుతుంది. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు స్పందిస్తూ ఐదవ తరగతిలో మేరీమాతను, ఆరవ తరగతిలో బెజవాడ కనకదుర్గను పాఠ్యాంశంలో చేర్చామని, ఇదే లౌకికవాదమన్నట్లుగా సమర్థించుకున్నారు. అసలు రాజ్యాంగం గురించి, లౌకికవాదమంటే ఏమిటో కూడా తెలియని ఇలాంటి వ్యక్తి ఆ పదవికి అనర్హుడు. రాజ్యం, మతం వేరువేరు అంశాలు. పాలనలో ఎక్కడా మతపరమైన అంశాలు రాకూడదు. దేవుళ్ల గురించి, మతాన్ని గురించి పాఠ్యాంశాలలో ప్రస్తావించకూడదు. దేవుళ్లు, మతాలూ వారి వారి వ్యక్తిగతం. ఇలాంటి వాటికి దూరంగా విద్యార్థులను ఉంచాలి. కనుక తక్షణమే ఐదవ తరగతిలోని మేరీమాత, ఆరవ తరగతిలోని కనకదుర్గ పాఠ్యాంశాలను తొలగించాలి. ఇంకా పురాణాలకు, మతాలకు సంబంధించిన అంశాలను విద్యావ్యవస్థ నుంచి తొలగిస్తే విద్యార్థులు శాస్త్రీయ విద్యను నేర్చుకొని సమాజానికి ఉపయోగపడతారు.
నార్నె వెంకటసుబ్బయ్య