HYD : కబ్జా కేసులో TRS నాయకురాలు వసంతకు రిమాండ్
ABN , First Publish Date - 2021-08-13T11:44:34+05:30 IST
టీఆర్ఎస్ నాయకురాలు వసంతతో పాటు ఖాళీస్థలంలో కంచె వేస్తున్న ముత్తుజా, వాజీద్లు ఆనాటి నుంచి పరారీలో ఉండగా గురువారం ఓ చోట దాక్కున్నారని సమాచారం
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఖరీదైన ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన టీఆర్ఎస్ నాయకురాలుతో పాటు మరో ఇద్దరిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తుకారాంగేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మారేడుపల్లి రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈనెల 6న రాత్రి 8.45 గంటలకు ఓ ప్రైవేట్ స్ధలం చుట్టూ కొందరు కంచె వేస్తుండగా ఆ సమాచారం అందుకున్న మారేడుపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ స్థలంపై వివాదం ఉంది.
ఈ నేపథ్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అడ్డగుట్ట డివిజన్ టీఆర్ఎస్ నాయకురాలు వసంతతో పాటు ఖాళీస్థలంలో కంచె వేస్తున్న ముత్తుజా, వాజీద్లు ఆనాటి నుంచి పరారీలో ఉండగా గురువారం ఓ చోట దాక్కున్నారని సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వసంతతో పాటు ఆ ఇద్దరిని సికింద్రాబాద్ కోర్టులోని 22వ మెజిస్టేట్ కోర్టు ముందు హాజరు పరుచగా ముగ్గురికి 14 రోజుల పాటు రిమాండు విధించారు. ఇదే కేసులో ఈనెల 7న మరో ఇద్దరిని అరెస్టు చేశామని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.